దానికి కాలమే సమాధానం చెబుతుంది: ట్రంప్
ABN , First Publish Date - 2020-11-14T19:13:47+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం వెలువడిన రెండు రాష్ట్రాల ఫలితాల్లో జార్జియా బైడెన్ ఖాతాలో చేరితే... నార్త్ కరోలినాలో ట్రంప్ గెలిచారు. దీంతో తుది ఫలితాలు వచ్చేసరికి బైడెన్ మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే... ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్ల దగ్గరే ఆగిపోయారు. కాగా, బైడెన్ తన ఆధిక్యాన్ని మరింత బలపరచుకున్నారు. దీంతో జనవరి 20న బైడెన్ అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం తన పరాజయాన్ని అంగీకరించకపోవడం గమనార్హం. ఇప్పటికీ తానే గెలిచానని చెబుతున్నారు. డెమొక్రట్లు చీటింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకు మీడియాతో మాట్లాడనని ట్రంప్... తొలిసారిగా శుక్రవారం రోజ్ గార్డెన్లో ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాపై ప్రకటన నిమిత్తం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా జార్జియా విజయంతో బైడెన్ తన ఆధిక్యాన్ని మరింత బలపరచుకున్నారు.. మీరు వైట్హౌస్ వదలడమే తరువాయి అని మీడియా చెప్పడంతో.. దీనికి కాలమే సమాధానం చెబుతుందని, తాను ఓడిపోలేదని ట్రంప్ మరోసారి తన పంతాను కొనసాగించారు. కాగా, ఈ ఎన్నికల్లో బైడెన్కు ట్రంప్ కంటే 5.3 మిలియన్ల ఓట్లు అధికంగా వచ్చాయి. బైడెన్కు పోలైన మొత్తం పాపులర్ ఓట్లు 50.8 శాతం కావడం గమనార్హం. ఇదిలాఉంటే... 2016 ఎన్నికల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 232 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే.. ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సేమ్ టు సేమ్ ఇవే డిజిట్స్ రిపీట్ అయ్యాయి. కాకపోతే డెమొక్రట్స్కు 306 వస్తే.. రిపబ్లికన్స్కు 232 వచ్చింది. అంటే జస్ట్... తారుమారు అయ్యాయి. నిజంగా ఇది యాధృచ్చికం అనే చెప్పాలి.