ఎన్నికల ఫలితాలపై ట్రంప్ భారీ ర్యాలీ !
ABN , First Publish Date - 2021-01-04T00:03:20+05:30 IST
నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే, తన ఓటమిని అంగీకరించని ట్రంప్.. తాను ఓడిన వివిధ రాష్ట్రాల్లో కోర్టుకెక్కారు. అక్కడ ఆయనకు పరాభవం తప్పలేదు. అనంతరం డిసెంబర్ 14న జరిగిన ఎలక్టోరల్ కాలేజీ ఎలక్షన్స్లో కూడా అదే సీన్ రీపిట్ అయింది. ఇక్కడ బైడెన్కు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తే.. ట్రంప్కు 232 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అక్కడ ట్రంప్కు పరాభవం ఎదురైంది. కానీ, ట్రంప్ ఇప్పటికీ తన ఓటమి అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఈ నెల 6న రాజధాని వాషింగ్టన్లో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. అభిమానులతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన ట్రంప్.. "జనవరి 6న ఉదయం 11 గంటలకు వాషింగ్టన్లో భారీ నిరసన ర్యాలీ ఉంటుంది." అని తెలిపారు. అలాగే మరో ట్వీట్లో.. "పెద్ద మొత్తంలో సాక్ష్యాలు సమర్పిస్తాం. కచ్చితంగా మేమే గెలుస్తాం." అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన బైడెన్ జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే తన పరిపాలన బృందాన్ని కూడా బైడెన్ రెడీ చేసుకున్నారు.