ఆక్సిజన్ను వృథా కానివ్వొద్దు
ABN , First Publish Date - 2021-05-09T06:32:09+05:30 IST
‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ను వృథా కానివ్వొద్దు. ప్రతి రెండు గంటలకోసారి కొవిడ్ బాధితుడిని వైద్యుడు పరీక్షించాలి. ఆక్సిజన్ కూడా మెడిసిన్ లాంటిదే. ఎక్కువ ఇచ్చినా, తక్కువ ఇచ్చినా మంచిది కాదు’ అని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు.
ప్రతి రెండు గంటలకోసారి కొవిడ్ బాధితుడిని వైద్యుడు పరీక్షించాలి
కలెక్టర్ హరినారాయణన్
తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ను వృథా కానివ్వొద్దు. ప్రతి రెండు గంటలకోసారి కొవిడ్ బాధితుడిని వైద్యుడు పరీక్షించాలి. ఆక్సిజన్ కూడా మెడిసిన్ లాంటిదే. ఎక్కువ ఇచ్చినా, తక్కువ ఇచ్చినా మంచిది కాదు’ అని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. శనివారం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆక్సిజన్ వినియోగం, ట్యాంకర్ల రాకపై నోడల్ అధికారులు, వైద్యులతో సమీక్షించారు. స్విమ్స్, రుయాలో ఆక్సిజన్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, వృథా నివారణపై నివేదిక తయారు చేయాలన్నారు. ఇదే పద్ధతి ప్రైవేటులోనూ జరగాలని చెప్పారు. ప్రధానంగా బాధితులు బాత్రూమ్ వెళ్లినపుడు, ఫుడ్ తీసుకునేటప్పుడు ఆక్సిజన్ వాడకం ఆపాలన్నారు. ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల ప్రకారం ఎంతమేరకు ఉపయోగించారన్న దానిపై రోజూ రిపోర్టు ఇవ్వాలన్నారు. స్విమ్స్లో కొత్త ఆక్సిజన్ ట్యాంకును రెండ్రోజుల్లో ఇన్స్టాల్ చేయాలన్నారు. రుయా, మెటర్నిటీ కలిపి 25కేఎల్ కెపాసిటీ ఉండగా, 12 కేఎల్ వరకు వాడకం ఉందన్నారు. అందువల్ల ఆక్సిజన్ సమస్య తలెత్తకూడదన్నారు. ఎప్పటికప్పుడు టాంకర్ల ట్రాకింగ్ ఉండాలని, లారీలు ఆలస్యమవకుండా వచ్చేలా చూడాలన్నారు. జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్, సబ్కలెక్టర్ జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్కుమార్, ఆర్డీవో కనకనరసారెడ్డి, జీఎం, డీఐసీ ప్రతాప్రెడ్డి, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ప్రొఫెసర్ రోజారమణి, స్విమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అలోక్సమంత్, జీఎం ప్రసన్నలక్ష్మి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన ఇతర అధికారులు పాల్గొన్నారు.