floods: ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక
ABN , First Publish Date - 2022-07-16T00:56:26+05:30 IST
ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) దగ్గర అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంట గంటకూ గోదావరి
ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) దగ్గర అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంట గంటకూ గోదావరి (Godavari) వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఇన్ఫ్లో 20.37, ఔట్ ఫ్లో 20.57 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం దగ్గర 18.60 అడుగులకు నీటిమట్టం పెరిగింది. వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులు దాటితే.. 6 జిల్లాల్లో 44 మండలాల్లోని 628 గ్రామాలపై ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా అదనపు సహాయక బృందాలు ఏర్పాటు చేసినట్లు విపత్తుల సంస్థ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
గోదావరి వరద ఉధృతి అనూహ్యంగా ముంచుకొస్తుండడంతో గోదావరి నదీ పరీవాహక లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని కాలం గడుపుతున్నారు. మరోవైపు ముంచుకొస్తున్న వరద ముప్పుతో ఊళ్లకు ఊళ్లనే ఖాళీ చేయాల్సిందేనంటూ పోలీసుల హెచ్చరిక లు చేస్తున్నారు. దీంతో పిల్లాపాపలతో ఎక్కడికి వెళ్లి జీవనం సాగించాలో తెలియని స్థితిలో లంక గ్రామాల ప్రజలు ఉన్నారు.