డాక్టర్.. తమిళిసై
ABN , First Publish Date - 2022-07-24T09:44:31+05:30 IST
డాక్టర్.. తమిళిసై
- విమానంలో అస్వస్థతకు గురైన
- తోటి ప్రయాణికుడు
- తక్షణమే వైద్య సాయం చేసిన గవర్నర్
- కోలుకున్న వ్యక్తి.. తమిళిసైకి ప్రశంసలు
హైదరాబాద్, శంషాబాద్రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సమయం ఉదయం నాలుగు గంటలు కావొస్తోంది ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు ఉండ గా విమానం దూసుకెళుతోంది. ఇంతలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఇక్కడెవరైనా వైద్యు లు ఉన్నారా ? అంటూ ఎయిర్ హోస్టెస్ గట్టిగా అడిగారు. దీంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడగా... ఓ మహిళ మాత్రం అస్వస్థతకు గురైన వ్యక్తి వద్దకు వే గంగా వచ్చారు. అక్కడున్న వారంతా ఆమెను చూసి ఆశ్చర్యపోగా.. చెమటలు కక్కుతూ తీవ్ర ఆందోళనలో ఉన్న ఆ వ్యక్తిని ఆమె పరీక్షించారు. విమానంలో అం దుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మందుల సాయం తో ప్రథమ చికిత్స చేశారు. కాసేపటికి కోలుకున్న ఆ వ్యక్తి ఆమెకు కృతజ్ఞతలు తెలపగా విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఆకాశవీధిలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆ మహిళ మరెవరో కాదు ..
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్య సాయం అందించేందు కు ఓ రాష్ట్ర గవర్నర్ కదిలి రావడమే విమానంలో ఉ న్నవారి ఆశ్చర్యానికి కారణం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో శనివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. వారాణసీ నుంచి తిరుగుప్రయాణంలో ఆమె ఈ విమానం ఎక్కారు. వృత్తి రి త్యా గైనకాలజిస్టు అయిన తమిళిసై.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైద్యవృత్తికి దూరమయ్యారు. ఏదేమై నా, గవర్నర్ వైద్య సాయం అందిస్తున్న ఫొటోలు, వీడియోలను ఇతర ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటికొచ్చింది. దీంతో గవర్నర్ తమిళిసైపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వీటిపై స్పందించిన గవర్నర్.. అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని విమానయాన సంస్థలకు సూచన చేశారు.
రాజ్భవన్లో ఘనంగా బోనాల వేడుక..
గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో బోనాల వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా అమ్మవారికి బోనం ఎత్తారు. రాజ్భవన్ ఆవరణలో ఉన్న నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. రాజ్భవన్లో నివసించే సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కరోనా తీవ్రత పెరుగుతున్నందున ప్రజలంతా బూస్టర్ డోసు టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటికీ రెండో డోసు తీసుకోని వారు తక్షణమే టీకా వేయించుకోవాలని గవర్నర్ సూచించారు.