తాగునీటి కష్టాలు పట్టవా?
ABN , First Publish Date - 2021-03-01T04:54:27+05:30 IST
వేసవిలో నగర వాసులకు తాగునీటి కష్టాలు తప్పేటట్టు లేదని మునిసిపల్ మాజీ వైఎస్ చైర్మన్లు, టీడీపీ సీనియర్ నేతలు కనకల మురళీమోహన్, విజ్జపు వెంకట ప్రసాద్ చెప్పారు.
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 28: వేసవిలో నగర వాసులకు తాగునీటి కష్టాలు తప్పేటట్టు లేదని మునిసిపల్ మాజీ వైఎస్ చైర్మన్లు, టీడీపీ సీనియర్ నేతలు కనకల మురళీమోహన్, విజ్జపు వెంకట ప్రసాద్ చెప్పారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. తోటపల్లి నీరు గడిగెడ్డకు వస్తేనే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. అయితే ముందుచూపు లేని మంత్రి బొత్స, ఎమ్మెల్యే కోలగట్ల ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే ముషిడిపల్లి వంటి తాగునీటి పఽథకాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయా తాగునీటి పథకాల్లో జలాలు అడుగంటుతున్నాయన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టు, గడిగెడ్డ వద్ద పరిస్థితిని ఫొటోల ద్వారా చూపించారు. నెల్లిమర్ల, రామతీర్థం, ముషిడిపల్లి నుంచి వస్తున్న నీటి సామర్థ్యం క్రమక్రమంగా తగ్గుతుందన్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నగరవాసులకు తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకుడు పూనమ్ చంద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.