ముంచుకొస్తున్న గడువు
ABN , First Publish Date - 2022-05-28T06:14:14+05:30 IST
రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పని సరిగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది.
- పీఎం కిసాన్ పథకానికి ఈ కేవైసీ చేయించుకునేందుకు మిగిలింది నాలుగు రోజులే..
- జిల్లాలో కిసాన్ పథకానికి 1.58 లక్షల మంది రైతులు
- ఇందులో ఇప్పటి వరకు ఈ కేవైసీ చేయించుకున్న వారు 63 వేల మంది
- వివరాల నమోదులో ఎదురవుతున్న కొత్త సమస్యలు
- ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ కాక అవస్థలు
- ఈనెల 31తో ముగియనున్న గడువు
- అదేరోజు రాత్రి నుంచి పెట్టుబడి సహాయం జమచేసే అవకాశం
కామారెడ్డి, మే 27(ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పని సరిగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది. పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులు కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈ కేవైసీని తప్పనిసరిగా చేసింది. కాగా ఈనెల 31 గడువును విధించింది. గడువు ముంచుకొస్తున్నప్పటికీ జిల్లాలో ఈ కేవైసీని 50 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఈ కేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులు నిలిపి వేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
కిసాన్ సమ్మాన్ పథకానికి 1.58 లక్షల మంది రైతులు
రాష్ట్రప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాన రూ.5లక్షల చొప్పున ప్రతీ సీజన్కు రైతుల ఖాతాలో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఇదే పథకం లాగా కేంద్రప్రభుత్వం సైతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని గత నాలుగేళ్ల కిందట అమలులోకి తెచ్చింది. ఈ పథకం కింద ఎకరాన ఏడాదికి రూ.6వేల చొప్పున విడతల వారీగా అందించాలని నిర్ణయించింది. మూడు విడతలుగా రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్రం పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఈ పథకానికి జిల్లాలో 1,58,470 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ గత 4 నెలలుగా ఈ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం నిధులను జమచేస్తూ వస్తోంది. ఈ సీజన్ నుంచి ఈ పథకం కింద ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకున్న వారికే పెట్టుబడి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది.
ఈ కేవైసీ చేయించుకున్నవారు 63వేల మంది రైతులు మాత్రమే..
కేంద్రప్రభుత్వం రైతుల పంటల సాగు కోసం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఏడాదికి రూ.6వేల పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కొందరు బోగస్ పేర్లను నమోదు చేయించుకుని లబ్ధి పొందుతున్నారని కేంద్రప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ పథకానికి అర్హులుగా ఉన్న వారు ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని ఈ కేవైసీ చేయించుకున్న వారికే పెట్టుబడి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31లోగా ఈ కేవైసీ చేసుకున్న వారికే కిసాన్ సమ్మాన్ డబ్బులు జమ అవుతాయని సూచించింది. జిల్లాలో మొత్తం 1.58 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 63,068 మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. అంటే 50 శాతం మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. గడువు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో మిగతా రైతులు ఈ కేవైసీ చేయించుకోవడం కష్టమేనని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
అనుసంధానం ఇలా..
రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలు ఇచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్కార్డును అనుసంధానం చేసుకోవాలి. తదుపరి ఆధార్కార్డుకు ఫోన్ నెంబర్ను అనుసంధానం చేయాలి అనంతరం పీఎంకిసాన్ పోర్టల్లో ఆధార్ ఆధారితంగా ఈ కేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నెంబర్కు వచ్చే రెండు ఓటీపీలను నమోదు చేస్తేనే ఈ కేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్యాప్ ద్వారా లేదంటే పోర్టల్ ద్వారా నేరుగా కామన్ సర్వీస్ సెంటర్లో కూడా ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తిచేసిన అర్హులైన రైతులు బ్యాంక్ ఖాతాకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గరి నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్ నెలలో 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈ కేవైసీతో ఈ నెల 31వ తేది రాత్రి నుంచి నిధులను విడుదల చేసే అవకాశం ఉంది.
అవగాహన కరువు
ఆధార్ అనుసంధానం, ఈ కేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే కొంత మంది రైతులు ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్కు ఫోన్ నెంబర్లు లింక్ లేకపోవడం లాంటి కారణాలతో మళ్లీమళ్లీ తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ కేవైసీని పూర్తి చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోయినందున రైతులంతా ఈ కేవైసీని పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.