Drug Peddler Tony : ముగిసిన టోనీ విచారణ.. కీలక అంశాలు వెలుగులోకి..?
ABN , First Publish Date - 2022-02-03T12:06:02+05:30 IST
డ్రగ్స్ సరఫరాదారుడు టోనీ విచారణ బుధవారం రాత్రి ముగిసింది. ముగ్గురు డీసీపీలు..
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట/సైదాబాద్ : డ్రగ్స్ సరఫరాదారుడు టోనీ విచారణ బుధవారం రాత్రి ముగిసింది. ముగ్గురు డీసీపీలు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో రాత్రి 9 వరకు టోనీని ప్రశ్నించినట్లు తెలిసింది. టోనీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారిని కూడా పంజాగుట్ట పీఎస్కు తరలించి విచారించారు. టోనీని, తాజాగా అరెస్టు చేసిన వారిని మధ్యాహ్నం వరకు వేర్వేరుగా విచారించిన పోలీసులు ఆ తర్వాత ఒకేచోట కూర్చొబెట్టి కీలక అంశాలు సేకరించినట్లు తెలుస్తోంది.
టోనీ సమాధానాలు, తాజాగా విచారించిన ఏడుగురి సమాధానాలతో లింకు చేసి పోలీసులు నివేదికలు సిద్ధం చేసుకున్నారు. చివరి రోజు విచారణలో టోనీ దందాలో ముంబై, గోవా టాప్లో ఉన్నాయని, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని గుర్తించారు. ట్రావెల్స్, ప్రైవేట్ క్యాబ్ల ద్వారానే డ్రగ్స్ తరలించినట్లు టోనీ వెల్లడించినట్లు సమాచారం. విచారణ పూర్తి కావడంతో టోనీని గురువారం కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చంచల్గూడ జైలుకు తరలించే అవకాశముంది.