టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు లభ్యం.. అన్ని కోట్లా..!?
ABN , First Publish Date - 2021-08-27T15:59:36+05:30 IST
డ్రగ్స్ కేసులో ఈడి దర్యాప్తు కొనసాగుతోంది. కోట్లలో సాగుతున్న డ్రగ్ మాఫియాపై ఈడి దృష్టి సారించింది.
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కోట్లలో సాగుతున్న డ్రగ్ మాఫియాపై ఈడీ దృష్టి సారించింది. విదేశాల నుంచి ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ దిగుమతి అవుతోంది. ఒక్క గ్రాము కొకైన్ విలువ దాదాపు రూ.10 వేల వరకు ఉంటుంది. టాలీవుడ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్కు అమెరికాలోని షికాగోలో ఉన్న అంతర్జాతీయ మత్తుమందుల ముఠాతో సంబంధాలు ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచే మత్తుమందులు దిగుమతి చేసుకున్నట్లు కెల్విన్ విచారణలో వెల్లడించాడు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చి అంతర్జాలం ద్వారా చెల్లింపులు చేసినట్లు చెప్పాడు. కొరియర్ల ద్వారా అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి డ్రగ్స్ దిగుమతి అయ్యేదని, మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలతోపాటు తపాలా ద్వారా డ్రగ్స్ సరఫరా అయ్యేదని, వాటికి చెల్లింపులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలోనే జరిగేదని వెల్లడించాడు. డ్రగ్స్ కొనుగోలుకు విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు, డబ్బంతా ఎక్కడిది వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది.
నాలుగేళ్ల క్రితం సంచలనం..
2017 జూలైలో హైదరాబాద్కు చెందిన ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసు విచారణలో పలువురు సినీప్రముఖుల పేర్లను నిందితులు వెల్లడించడం సంచలనమైంది. ఇప్పటికే సదరు సినీప్రముఖులను సిట్ విచారించింది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులను నమోదు చేసి, 30 మందిని సిట్ అరెస్ట్ చేసింది. 11 చార్జీషీట్లను కోర్టులో దర్యాప్తు అధికారులు దాఖలు చేశారు. ఈ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ను వినియోగించినట్లు సిట్ గుర్తించింది. సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్ జరిగి ఉంటుందని ఈడీ భావిస్తోంది.