రైలు బండి లాంటి బస్సును చూశారా?.. జపాన్లో కొత్త ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-12-27T09:02:52+05:30 IST
రైలు బండిని పోలిన బస్సును ఎక్కడైనా చూశారా?.. ఇదిగో డబుల్ మోడ్ వాహనం. ఇది బస్సు, రైలు విధాలుగా పనిచేస్తుంది. దీనిని జపాన్ పరిశోధకులు కనుగొన్నారు...
రైలు బండిని పోలిన బస్సును ఎక్కడైనా చూశారా?.. ఇదిగో డబుల్ మోడ్ వాహనం. ఇది బస్సు, రైలు విధాలుగా పనిచేస్తుంది. దీనిని జపాన్ పరిశోధకులు కనుగొన్నారు.
ప్రపంచంలోనే మొదటిసారి.. ఈ డ్యుయెల్ మోడ్ వాహనాన్ని ప్రజా రవాణా కోసం జపాన్ ప్రభుత్వం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ వాహనం ఒక మినీ బస్సు, ఒక మినీ రైలు లాగా కనిపిస్తుంది. బస్సుగా మారినప్పుడు సాధారణ రబ్బరు టైర్లతో రోడ్లపై నడుస్తుంది. మరోవైపు రైలుగా మారినప్పుడు పట్టాలపై పరుగులు తీసేందుకు ఇంటర్ చేంజ్ స్టేషన్లలో యాక్టివేట్ అయ్యే స్టీల్ వీల్స్ ఈ వాహనం కలిగి ఉంది.
రైలుగా నడిచేందుకు రబ్బరు టైర్లు పైకి లేచి వాటి స్థానంలో స్టీల్ వీల్స్ బయటకు వస్తాయి. వెనుక ఉన్న రబ్బరు టైర్లు బండిని రైలు పట్టాలపైకి నెట్టుతాయి. రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, రోడ్డుపై 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని జపాన్కు చెందిన ఆసా కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ మినీ వాహనంలో 21 మంది సౌకర్యంగా ప్రయాణించవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆసా కోస్ట్ రైల్వే సీఈవో షిగెకి మియురా తెలిపారు. ఈ వాహనాన్ని తొలిసారి జపాన్లోని కైయో నగరంలో క్రిస్మస్ సందర్భంగా ప్రారంభించారు.