తెలుగు కార్మికుడికి రూ.3 కోట్ల బిల్లును మాఫీ చేసిన Dubai ఆస్పత్రి.. హైదరాబాద్‌కు రాగానే సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2021-09-18T16:27:31+05:30 IST

ఆయనది వారి దేశం కాదు. ప్రముఖ వ్యక్తి కూడా కాదు.. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ఉద్యోగి. దేశం కాని దేశంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైతే అక్కడి ఆస్పత్రి మెరుగైన చికిత్సను అందించింది. వైద్యానికి ఏకంగా రూ.3 కోట్ల బిల్లు అయితే అంతా మాఫీ చేసింది. అయితే విమానమెక్కి స్వదేశంలో అడుగుపెట్టిన ఆయనకు మాతృగడ్డ మీద చేదు అనుభవం ఎదురైంది.

తెలుగు కార్మికుడికి రూ.3 కోట్ల బిల్లును మాఫీ చేసిన Dubai ఆస్పత్రి.. హైదరాబాద్‌కు రాగానే సీన్ రివర్స్..!

రూ.3కోట్ల బిల్లు మాఫీ చేసిన దుబాయి ఆస్పత్రి!

నిమ్స్‌లో చేరిన 24 గంటల్లోనే బిల్లు కట్టాలని సతాయింపు

జగిత్యాల వ్యక్తి కోమాలోకి వెళ్లడంతో ఆర్నెల్లకుపైగా చికిత్స

విమానంలో హైదరాబాద్‌కు.. సాయంగా దుబాయి నర్సు


(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆయనది వారి దేశం కాదు. ప్రముఖ వ్యక్తి కూడా కాదు.. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ఉద్యోగి. దేశం కాని దేశంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైతే అక్కడి ఆస్పత్రి మెరుగైన చికిత్సను అందించింది. వైద్యానికి ఏకంగా రూ.3 కోట్ల బిల్లు అయితే అంతా మాఫీ చేసింది. డిశ్చార్జి అనంతరం స్వదేశానికి వెళ్లాలనుకున్న ఆయనకు సాయంగా ఉండేందుకుగాను ప్రత్యేకంగా ఓ నర్సును పంపింది. అయితే విమానమెక్కి స్వదేశంలో అడుగుపెట్టిన ఆయనకు మాతృగడ్డ మీద చేదు అనుభవం ఎదురైంది.


ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే బిల్లు చెల్లించాలంటూ ఆయన్ను నిర్వాహకులు డిమాండ్‌ చేశారు! కోట్లలో ఫీజు మాఫీ చేసింది దుబాయిలోని ఆస్పత్రి అయితే ఒక్కరోజు గడవకుండానే డబ్బు కట్టాలని డిమాండ్‌ చేసింది హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి. ఆ బాధితుడు, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కట్టా గంగారెడ్డి. ఆయన దుబాయిలోని ఒక చిన్న సంస్థలో పనిచేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరు 25న గంగారెడ్డి శ్వాస సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మెడిసిటీ క్లిన్‌ అనే ఆస్పత్రిలో చేరగా నరాలన్నీ దెబ్బతినడంతో శ్వాస వ్యవస్థ చెడిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఐసీయూలో ఉంచి చికిత్సనందించారు. 


కాగా.. దుబాయిలోని ఆస్పత్రి నుంచి గంగారెడ్డిని హైదరాబాద్‌కు పంపించే ఏర్పాట్లను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) దగ్గర ఉండి మరీ పర్యవేక్షించింది. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు అధ్యక్షులు గుండేల్లి నర్సింహా, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ, కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్,  ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల మరియు సభ్యులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.


కోమాలోకి వెళ్లిపోయిన గంగారెడ్డి, మళ్లీ ఆర్నెల్ల తర్వాత స్పృహలోకి వచ్చాడు. డాక్టర్‌ అసద్‌ అల్‌ సభా నేతృత్వంలో 11 మంది వైద్యుల బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స ను అందించింది. గంగారెడ్డి చికిత్సకు భారత కరెన్సీలో రూ.3 కోట్లు బిల్లు అయింది. గంగారెడ్డి ఉద్యోగ సంబంధిత సమస్యతో అనారోగ్యానికి గురవ్వలేదని, ఆ మేరకు చికిత్స బాధ్యత తనది కాదని ఆయన పనిచేసే సంస్థ యజమాని చేతులెత్తేశాడు. గంగారెడ్డి అనారోగ్య సమస్య బీమా పరిధిలోకి రాదని బీమా సంస్థ పేర్కొంది. అంత మొత్తం చెల్లించే స్థోమతేమో గంగారెడ్డికి లేదు. అటు.. ఆస్పత్రి యాజమాన్యమే మో బిల్లు చెల్లించకుండా ఆయన్ను డిశ్చార్జి చేయబోమని  స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న దుబాయిలోని సామాజిక సేవకుడు గుండల్లి నరసింహా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. గంగారెడ్డి పరిస్థితి దృష్ట్యా మనవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. 


సానుకూలంగా స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం, రూ.3 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేనా.. గురువారం దుబాయి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన గంగిరెడ్డికి ప్రయాణంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్సను అందించేందుకు ప్రత్యేకంగా ఓ నర్సును పంపించింది. ఈ విమానం టికెట్ల ఖర్చును భారత రాయబార కార్యాలయం భరించింది. కాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన గంగిరెడ్డి, శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యాడు. అయితే అక్కడ చికిత్సకు అవసరమైన డబ్బును చెల్లించాల్సిందిగా ఆస్పత్రి వర్గాలు డిమాండ్‌ చేశాయి. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆయన, కుటుంబసభ్యులు.. సాయం కోసం మరోసారి గుండల్లి నరసింహాను సంప్రదించారు. అయితే దుబాయిలో తాము చేయాల్సినంత చేశామని.. కానీ తమ మాతృభూమి అయిన తెలంగాణలో తాము నిస్సహాయులం అని ఆయన వాపోయారు. 

Updated Date - 2021-09-18T16:27:31+05:30 IST