దుర్గా నవరాత్రులు

ABN , First Publish Date - 2022-09-26T08:24:37+05:30 IST

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా... నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి.

దుర్గా నవరాత్రులు

శ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా... నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు కొలువుదీరిన క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా వివిధ రూపాల్లో కొలుస్తారు. అందులోనూ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి పూజ, ఆరాధన ఈ దసరా రోజుల్లో అత్యంత విశేషం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకార విశేషాలు, సమర్పించే నైవేద్యాల వివరాలు రోజూ ‘నవ్య’ పాఠకుల కోసం...


నేటి అలంకరణ

స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి 

26-09-2022 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారి తొలి అలంకారం... స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి. బంగారు కవచం ధరించి, సువర్ణ కాంతులీనుతూ భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తారు. ‘దుర్గా’ అంటే దుర్గతులు నశిస్తాయనీ, ఆ తల్లిని దర్శించుకోవడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందనీ నమ్మిక. ముగురమ్మల మూలపుటమ్మగా ఆమెను కొలుస్తారు. అలా కొలిచిన భక్తులకు భయం ఉండదనీ, భద్రత కలుగుతుందనీ విశ్వాసం. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఇతిహాసం ప్రకారం, పూర్వం మాధవవర్మ మహారాజు విజయవాటికాపురి (నేటి విజయవాడ)ని ధర్మం నాలుగు పాదాలా నడిచేలా, అత్యంత జనప్రియంగా పరిపాలన సాగిస్తుండేవాడు. అతడు గొప్ప దేవీ భక్తుడు. ఒకరోజు ఆయన కుమారుడు నగర సందర్శన సమయంలో అతని రథ చక్రాల కింద  ఒక బాలుడు పడి మరణించాడు. ఆ బాలుడి తల్లితండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం చేయాలని రాజును కోరారు. విచారించిన రాజు తన కుమారుడిని దోషిగా నిర్ణయించి, అతడికి మరణశిక్ష విధించాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు (దుర్గాదేవి) మృతిచెందిన బాలుడికి ప్రాణభిక్ష పెట్టారు. విజయవాటికాపురిలో కొన్ని గంటల పాటు కనకవర్షాన్ని కురిపించారు. అప్పటి నుంచి ఆ తల్లి ‘కనకదుర’్గగా పూజలందుకుంటున్నారు.


నైవేద్యం: చక్కెర పొంగలి, గారెలు, మినప పిండితో చేసిన ఇతర వంటలు

అలంకరించే చీర రంగు: బంగారు వర్ణం

అర్చించే పూల రంగు: ఎరుపు

పారాయణ : దుర్గా సప్తశతి

Updated Date - 2022-09-26T08:24:37+05:30 IST