రేపు కృష్ణానదిలో దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్

ABN , First Publish Date - 2020-10-24T18:58:58+05:30 IST

కృష్ణానదిలో రేపు అనగా ఆదివారం జరగాల్సిన దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్ పడింది.

రేపు కృష్ణానదిలో దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్

విజయవాడ : కృష్ణానదిలో రేపు అనగా ఆదివారం జరగాల్సిన దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్ పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నదిలో తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడింది. ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో-ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి ఇంజనీర్ భాస్కర్ మీడియా మీట్ నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


రాకపోకలు ఆపేస్తాం..

ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించాం. నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నదిలో దుర్గా మళ్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తాం. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో అమ్మ, స్వామివార్ల ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిస్తాం. తెప్పోత్సవం నిర్వహించే ఫంట్ సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఫిట్‌నెస్ ధృవపత్రం తీసుకున్నాకే అనుమతిస్తాం. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రకాశం బ్యారేజీపై భక్తుల రద్దీ నివారణకు చర్యలు తీసుకుంటాం. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ వంతెనలపై వాహనాలు, భక్తులు రాకపోకలు ఆపేస్తాంఅని భాస్కర్ మీడియాకు వివరించారు.

Updated Date - 2020-10-24T18:58:58+05:30 IST