నేటి అలంకరణ శ్రీరాజరాజేశ్వరీదేవి

ABN , First Publish Date - 2021-10-15T05:30:00+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆఖరి రోజైన విజయదశమి నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు..

నేటి అలంకరణ శ్రీరాజరాజేశ్వరీదేవి

15- 10- 2021 ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) శుక్రవారం

శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆఖరి రోజైన విజయదశమి నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. సకల భువనాలకు ఆమె అధిదేవత. షోడశాక్షక మహామంత్ర స్వరూపిణి అయిన శ్రీరాజరాజేశ్వరిని మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంతి స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్ఠాన దేవత. ఆమెను కొలిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, కోరికలను నెరవేరుతాయనీ భక్తుల విశ్వాసం.

నైవేద్యం: పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు

అలంకరించే చీర రంగు: ఆకుపచ్చ, తెలుపు

అర్చించే పూల రంగు: ఎరుపు

పారాయణ: చెయ్యాల్సింది: లలితా సహస్రనామం

అర్చన: ఎర్రటి గాజులతో అలంకరించి, కుంకుమార్చన


Updated Date - 2021-10-15T05:30:00+05:30 IST