వీరలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ABN , First Publish Date - 2020-10-25T05:47:59+05:30 IST
శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారు శనివారం వీరలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.
భద్రాచలం, అక్టోబరు 24: శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారు శనివారం వీరలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీ శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వీరలక్ష్మి అలంకారం ధరింపజేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో అభిషేకం, శ్రీ రామాయణంలోని యుద్దకాండ పారాయణం చేశారు. సంక్షిప్త రామాయణ హోమం, సామూహిక కుంకుమార్చన, విశేష దర్బారు సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాద గోస్టి నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
రామాలయాన్ని దర్శించుకున్న కేంద్ర వస్తుసేవల పన్ను అధికారులు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని కేంద్ర వస్తువసేల పన్ను తెలంగాణ చీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా, అడిషనల్ కమీషనర్ బాలకృష్ణరాజు, రంగారెడ్డి కమీషనరేట్ అధికారి రాఘవన్, ఉమ్మడి జిల్లా అధికారులు ఎం.సత్యనారాయణ, బి.హేమంత్లు దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నేడు మహాలక్ష్మి అలంకారం
ఆదిలక్ష్మి యొక్క మరొక స్వరూపమే మహాలక్ష్మి. ఈమె యొక్క కనుసన్నల్లోనే జగత్పతి అయిన మహావిష్ణువు సృష్టి స్థితి సంహారములను చేస్తారు గనుక అందుకే ఆ తల్లికి మహాలక్ష్మి అని పేరు. ఈ క్రమంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు ఆలయ ప్రాంగణంలో అమ్మవారు సోమవారం మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.