ఘనంగా దసరా
ABN , First Publish Date - 2020-10-27T10:47:13+05:30 IST
జిల్లా అంతటా ఆదివారం విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పండగ సంబరాలు అంబరాన్నంటాయి. భక్తుల ప్రత్యేక పూజలు, అర్చనలు, శమీపూజలతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి
శమీ పూజలు... మహిషాసుర సంహారలీలలు
జిల్లా అంతటా పండగ సందడి
కరీంనగర్ కల్చరల్, అక్టోబర్ 26: జిల్లా అంతటా ఆదివారం విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పండగ సంబరాలు అంబరాన్నంటాయి. భక్తుల ప్రత్యేక పూజలు, అర్చనలు, శమీపూజలతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఆలయాలతోపాటు పలు వీధుల్లో, కూడళ్లలో, కాలనీలలో శమీ పూజలు జరిపి శమీ వృక్ష పత్రాలను పెద్దలకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్ద ఎత్తున వాహన పూజలు చేయించుకున్నారు. మరోవైపు రాంలీల, మహిషాసుర సంహారలీలలు జోరుగా సాగాయి.
కనువిందు చేసిన లేజర్ షో...
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్రావు నేతృత్వంలో అంబేద్కర్ స్టేడియంలో రాత్రి నిర్వహించిన లేజర్, క్రాకర్షో, రాంలీల కార్యక్రమాలు కనువిందు చేశాయి. కార్యక్రమంలో కలెక్టర్ కె శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి, నగరవాసులు పాల్గొన్నారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో జరిగిన శమీ పూజలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.