అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. అదుపు తప్పిన ఆందోళనలు

ABN , First Publish Date - 2022-05-24T23:24:19+05:30 IST

మలాపురం పట్టణం రణరంగంగా మారింది. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. తూర్పుగోదావరి జిల్లాను ...

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. అదుపు తప్పిన ఆందోళనలు

కోనసీమ: అమలాపురం పట్టణం రణరంగంగా మారింది. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. తూర్పుగోదావరి జిల్లాను కూడా విభజించింది. ఇందులో కోనసీమ జిల్లా కూడా ఉంది. విభజన ప్రశాంతంగా జరిగినా.. ఇప్పుడు మాత్రం కోనసీమ జిల్లా ధర్నాలు, నిరసనలతో రగిలిపోతోంది. ఇందుకు కారణం కోనసీమ జిల్లా పేరు మార్చడం. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది.  దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ వాటిని పట్టించుకోలేదు. దీంతో అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. 


అమలాపురం పట్టణంలోకి జేఏసీ నేతలు, జిల్లా సాధన సమితి నాయకులు, యువకులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. యువకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది తీవ్రతరం కావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణంగా మారింది. యువకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరు యువకులు ఓ ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ, గన్ మెన్లతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అటు పోలీసు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ప్రస్తుతం అమలాపురంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో అదనపు బలగాలు మోహరించనున్నాయి. అమలాపురంలోని పరిస్థితులను డీఐజీ  పరిశీలిస్తున్నారు



Updated Date - 2022-05-24T23:24:19+05:30 IST