ఇక ఈజీ టికెటింగ్
ABN , First Publish Date - 2022-05-28T06:11:35+05:30 IST
ఇక ఈజీ టికెటింగ్
రైల్వేస్టేషన్లలోని ఏటీవీఎంలలో క్యూఆర్ కోడ్ నగదు చెల్లింపులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల (ఏటీవీఎం) ద్వారా నగదు రహిత విధానంలో టికెట్లను కొనేందుకు క్యూఆర్ కోడ్ పేమెంట్ విధానాన్ని విజయవాడ డివిజన్లోని అన్ని రైల్వేస్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు ఏటీవీఎం ద్వారా స్మార్ట్కార్డు ఉపయోగించి ప్రయాణికులు టికెట్లు కొనేవారు. తాజాగా స్మార్ట్కార్డుతో పనిలేకుండా ఏటీవీఎం మెషీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయటం ద్వారా ఫోన్ నుంచే చెల్లింపులు చేసే సదుపాయాన్ని తీసుకొచ్చారు. అన్ రిజర్వుడు టికెట్లు కొనే వారికి ఇది చాలా ఉపయోగపడే విధానం.
ఉపయోగించే విధానమిది..
అన్ రిజర్వుడు టికెట్లు కొనాలనుకునే ప్రయాణికులు సమీప రైల్వేస్టేషన్లలోని ఏటీవీఎంల వద్దకు వెళ్లి.. స్ర్కీన్పై డిస్ప్లేలో మీరు ఎక్కడికి ప్రయాణించాలో మ్యాప్లో చూపించాలి. ఇది కష్టమనిపిస్తే గమ్యస్థానం స్టేషన్ బాక్స్ ఐకాన్లో టైప్ చేయటం ద్వారా రైళ్ల వివరాలు డిస్ప్లే అవుతాయి. మీరు ఏ రైల్లో ఎక్కాలను కుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రయాణ వివరాలు తెలిపే ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇందులో మీ ప్రయాణ వివరాలు పొందుపరచటానికి ఇష్టం లేకపోతే, తర్వాత వచ్చే పే ఆప్షన్లోకి వెళ్లాలి. క్యూఆర్ కోడ్ అదనపు ఫీచర్ను ఇవ్వటం ద్వారా దాని సహాయంతో మీరు చెల్లింపులు చేయొచ్చు. పేటీఎం, ఫ్రీ చార్జి ఆప్షన్లలో మీకు ఇష్టమైన దానిని సెలక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా పేటీఎం, గూగుల్ పే, భీమ్, ఫోన్ పే ఇలా ఏదైనా బ్యాంకు మొబైల్ యాప్ ద్వారా ఏటీవీఎంపై కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయొచ్చు. దీనిద్వారా పేమెంట్ గేట్ వేలోకి వెళ్తారు. చెల్లింపు పూర్తి కావటానికి పిన్ నెంబర్ను ఎంటర్ చేస్తే చాలు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 180 సెకన్లలో పూర్తవుతుంది. ఆ తర్వాత టికెట్ బయటకు వస్తుంది. జనరల్ టికెట్లు కొనేవారు ఎలాంటి క్యూ, రద్దీ లేకుండా సౌకర్యవంతంగా టికెట్ను పొందటానికి ఇది మంచి అవకాశమని విజయవాడ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (సీనియర్ డీసీఎం) వావిలపల్లి రాంబాబు తెలిపారు.