ఇమ్యూనిటీ వంటకాలు తిందామా
ABN , First Publish Date - 2021-05-15T05:30:00+05:30 IST
కొవిడ్ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ ఉండాలి.మరి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి డైట్ ఉండాల్సిందే...
కొవిడ్ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ ఉండాలి.
మరి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి డైట్ ఉండాల్సిందే.
టొమాటో కాధా మసాలా షోర్బా, నాన్ వెజ్ రెసిపీలైన మరాక్, ముర్గ్ మలాయి కబాబ్, చాట్పటి మచ్చీ,
హైదరాబాద్ దమ్ కా ముర్గ్ ఆ కోవకు చెందినవే.
వాటి రుచులను మీరూ ఆస్వాదించండి.
టొమాటో కాధా మసాలా షోర్బా
కావలసినవి
టొమాటో - 300గ్రా, క్యారెట్ - 100గ్రా, వెల్లుల్లి - 50గ్రా, కొత్తిమీర వేళ్లు - కొద్దిగా, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 30గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా, నూనె - సరిపడా, యాలకులు - 30గ్రా, లవంగాలు - 30గ్రా, దాల్చిన చెక్క - 30గ్రా, సాజీరా - 30గ్రా.
తయారీ విధానం:
- క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేళ్లని ముక్కలుగా తరగాలి. ఫ తరువాత వాటిని ఒక పాత్రలో తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి స్టవ్పై పెట్టి ఉడికించాలి.
- వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, సాజీర వేసి నీళ్లు సగం ఇంకే వరకు మరిగించాలి. తరువాత వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ స్టవ్పై పాన్ పెట్టి టొమాటో ముక్కలు వేసి
- చిన్నమంటపై వేగించాలి.
- ఇప్పుడు టొమాటో ప్యూరీని, మరిగించి వడగట్టి పెట్టుకున్న మిశ్రమంలో కలపాలి. మరికాసేపు ఉడికించాలి.
- తగినంత ఉప్పు వేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
ముర్గ్ మలాయి కబాబ్
కావలసినవి
బోన్లెస్ చికెన్ - ఒకకేజీ, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 100గ్రా, నిమ్మకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, పెరుగు - 100గ్రా, జీడిపప్పు - 100గ్రా, జీలకర్ర పొడి - 50గ్రా, మెంతిపొడి - 50గ్రా, గరంమసాల - 50గ్రా, తెల్లమిరియాల పొడి - 50గ్రా, కుకింగ్ క్రీమ్ - 100ఎంఎల్.
తయారీ విధానం
- చికెన్ను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి, తగినంత ఉప్పు వేసి మారినేట్ చేసుకోవాలి.
- ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో జీడిపప్పు పేస్టు, జీలకర్రపొడి, మెంతిపొడి, మిరియాలపొడి, గరంమసాల, కుకింగ్ క్రీమ్ వేసి కలుపుకొని మసాలా సిద్ధం చేసుకోవాలి.
- ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ముక్కలను మసాలాలో వేసి ముక్కలకు మసాలా పట్టేలా కలపాలి.
- తరువాత చికెన్ ముక్కలను పుల్లకు గుచ్చాలి. తందూరీ పాట్లో ఉడికించాలి.
- పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
మరాక్
కావలసినవి
మటన్ బోన్స్-కేజీ, ఉల్లిపాయలు- 100గ్రా, పచ్చిమిర్చి- 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు -50గ్రా, ధనియాలు- 30గ్రా,మిరియాలు- 30గ్రా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, కారం- 50గ్రా, కొత్తిమీరవేళ్లు- కొద్దిగా, పాన్ కి జాద్- 50గ్రా, ఖుస్ కి జాద్ - 50గ్రా.
తయారీ విధానం
- ఒక పాత్రలో మటన్ బోన్స్ తీసుకుని అందులో కొత్తిమీర వేళ్లు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు మరిగాక స్టవ్పై దింపి వడగట్టుకుని స్టాక్ని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్పై ఒక పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, ధనియాలు, పాన్ కి జాద్, ఖుస్ కి జాద్ వేసి మరికాసేపు వేగించాలి.
- ఇప్పుడు మటన్ వేసి మరికాసేపు ఉడికించాలి.
- తరువాత పక్కన పెట్టుకున్న స్టాక్ వేసి మరిగించాలి. ఎముక మజ్జ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.
- వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
చాట్పటి మచ్చీ
కావలసినవి
మ్యురెల్ చేప - ఒకకేజీ, నిమ్మకాయలు - నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు - 100గ్రా, పెరుగు - 50గ్రా, పుదీనా పేస్టు - 100గ్రా, జీలకర్రపొడి - 50గ్రా, గరంమసాల - 50గ్రా, యెల్లో కలర్ - చిటికెడు, ఉప్పు - తగినంత, కారం - 50గ్రా, కస్తూరీ మెంతి పొడి - 50గ్రా.
తయారీ విధానం
- చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటికి అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మారినేట్ చేసుకోవాలి.
- ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో జీలకర్రపొడి, గరంమసాల, కారం, మెంతిపొడి, యెల్లో కలర్ వేసి కలుపుకోవాలి.
- తరువాత అందులో మారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసి మసాలా పట్టేలా కలుపుకోవాలి.
- ఇప్పుడు చేప ముక్కలను పుల్లలకు గుచ్చి క్లే ఓవెన్లో ఉడికించుకోవాలి.
- వేడి వేడిగా సర్వ్ చేయాలి.
హైదరాబాద్ దమ్ కా ముర్గ్
కావలసినవి: చికెన్ లెగ్ పీస్లు - 800గ్రా(బోన్లెస్), జీడిపప్పు - 200గ్రా, బాదం - 50గ్రా, ఖుస్ఖుస్ - 50గ్రా, సారపప్పు(చిరోంజి) - 50గ్రా, ఉల్లిపాయలు - 200గ్రా, నెయ్యి - 100గ్రా, టొమాటో - 400గ్రా, పెరుగు -200గ్రా, మిరియాలపొడి - 10గ్రా, కారం - 20గ్రా, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - 100గ్రా, గరంమసాల - 20గ్రా, పుదీనా - 50గ్రా, ఉప్పు - తగినంత, ఎండు కొబ్బరి - 100గ్రా, పసుపు - 20గ్రా, పచ్చిమిర్చి పేస్టు - 50గ్రా.
తయారీ విధానం
- చికెన్ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ టొమాటోలను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. జీడిపప్పును పేస్టు చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి.
- సారపప్పు, ఎండుకొబ్బరి, ఖుస్ఖుస్, బాదం పలుకులను పాన్పై వేసి వేగించి, పేస్టు చేసుకోవాలి.
- స్టవ్పై పాన్ పెట్టి నెయ్యి, నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.
- తరువాత టొమాటో పేస్టు, డ్రై ఫ్రూట్ పేస్టు వేసి కలపాలి. పెరుగు కూడా వేసి కలియబెట్టుకొని గ్రేవీ రెడీ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్పై మరొక పాన్ పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత చికెన్ ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు, కారం వేసి ముక్కలు వేగించాలి.
- ఇప్పుడు సిద్ధంగా ఉన్న గ్రేవీ వేసి మరికాసేపు ఉడికించాలి.
- కొత్తిమీర గార్నిష్తో సర్వ్ చేసుకోవాలి.
వెంకటేశ్వర రావు కొడాలి,ఎగ్జిక్యూటివ్ చెఫ్