బెంగాల్‌లో 646 కంపెనీల బలగాలు మోహరింపు

ABN , First Publish Date - 2021-04-29T21:31:47+05:30 IST

ఎన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తుతున్నారు. గడిచిన 7 దశల్లోనూ సగటున 80 శాతం పోలింగ్ నమోదైంది. అతి ఎక్కువగా మొదటి దశలో 84.63 శాతం నమోదైంది

బెంగాల్‌లో 646 కంపెనీల బలగాలు మోహరింపు

కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు 646 కంపెనీలకు చెందిన బలగాలను మోహరించారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతోన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వీరిని మోహరించినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.


గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కొనసాగుతోంది. మద్యాహ్నం 3 గంటల వరకు 56.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్‌లో ఎక్కువగా బిర్భుంలో నమోదైంది. బిర్భుంలో 60.31 శాతం నమోదైంది. ఇక అత్యంత తక్కువగా ఉత్తర కోల్‌కతాలో 41.73 శాతం నమోదైంది.


ఎన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తుతున్నారు. గడిచిన 7 దశల్లోనూ సగటున 80 శాతం పోలింగ్ నమోదైంది. అతి ఎక్కువగా మొదటి దశలో 84.63 శాతం నమోదైంది. తక్కువగా ఏడవ దశలో 76.89 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా కొనసాగుతున్న ఎనిమిదవ దశ పోలింగ్ చివరిది. ఈరోజుతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోతాయి. ఇక మే 2న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.

Updated Date - 2021-04-29T21:31:47+05:30 IST