ఆర్థిక అక్షరాస్యతపై మహిళల్లో అవగాహన
ABN , First Publish Date - 2021-03-06T06:19:25+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్థిక అక్షరాస్యపై బుర్రకథల రూపంలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాబార్డు జనరల్ మేనేజర్ బి.ఉదయభాస్కర్ తెలిపారు.
- నాబార్డు జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్
- కడియపులంకలో రూ.1.17 లక్షలు రుణాల అందజేత
కడియం, మార్చి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్థిక అక్షరాస్యపై బుర్రకథల రూపంలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాబార్డు జనరల్ మేనేజర్ బి.ఉదయభాస్కర్ తెలిపారు. రుణాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కడియపులంక విచ్చేసిన నాబార్డు బృందం, జిల్లా అభివృద్ధి మేనేజర్ సోమినాయుడు, కాకినాడ డీసీసీబీ సీఈవో పి.ప్రవీణ్కుమార్తో కలిసి పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. నర్సరీ రైతులు సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉదయభాస్కర్ మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా జాయింట్ లైబిలిటీ గ్రూపుల ద్వారా రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. సహకార సొసైటీల ద్వారా ఈ రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు అతి తక్కువ వడ్డీతో రుణా లు, చేనేత కార్మికులకు డీసీసీబీల ద్వారా 9 శాతం వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా సంఘాలకు రూ.50 లక్షలు, రెండో విడతగా 122 సంఘాలకు రూ.1.17 లక్షలు అందించామన్నారు. నాబార్డు సౌజన్యంతో జీవన్ ఆదార్, మహిళా సంఘాలకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం శ్రీధర్చౌదరి, బీఎం సత్యానంద్, కడియం డీసీసీబీ మేనేజర్ ఉమారాణి, సొసైటీల సీఈవోలు చంద్రరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.