చైనా లోన్ యాప్లపై ఈడీ కొరడా
ABN , First Publish Date - 2022-09-30T06:44:32+05:30 IST
చైనా నియంత్రిత లోన్ యాప్ల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా రూ.9.82 కోట్ల నిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం స్తంభింపచేసింది. పలు యాప్లకు చెందిన ఆన్లైన్ పేమెంట్ గేట్వే ఖాతాల్లో వ్యాపార సంస్థలు
రూ.9.82 కోట్ల నిధులు ఫ్రీజ్
మనీ లాండరింగ్ చట్టం కింద చర్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: చైనా నియంత్రిత లోన్ యాప్ల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా రూ.9.82 కోట్ల నిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం స్తంభింపచేసింది. పలు యాప్లకు చెందిన ఆన్లైన్ పేమెంట్ గేట్వే ఖాతాల్లో వ్యాపార సంస్థలు ఉంచిన నిధులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయా యాప్లపై ఈడీ దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే. చైనా నియంత్రణలోని కొమీన్ నెట్వర్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు మరికొన్ని సంస్థలు దేశంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని యాప్లను నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. క్యాష్హోం, క్యాష్మార్ట్, ఈజీలోన్ తదితర యాప్లు... అధికంగా ఆదాయం వస్తుందని ఆశ చూపించి ప్రజల నుంచి నిధులను సమీకరిస్తున్నాయని తెలిపింది. యాప్ ఆధారిత ఇన్వె్స్టమెంట్ టోకెన్ యాప్ హెచ్పీజడ్పై దర్యాప్తులో భాగంగా కొమీన్ టెక్నాలజీ, మొబిక్రెడ్, మ్యాజిక్ డేటా, బైటు టెక్నాలజీ, వియ్క్యాష్, లార్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాజిక్ బర్డ్ టెక్నాలజీ, ఏస్ పెర్ల్ సర్వీసెస్ తదితర కంపెనీలకు చెందిన నిధులను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ నెల మొదట్లో మరికొన్ని యాప్ల ఖాతాల్లోని రూ.46.67 కోట్ల నిధులను ఈడీ స్తంభింపచేసిన సంగతి తెలిసిందే.