Epsదే పైచేయి

ABN , First Publish Date - 2022-06-24T15:30:52+05:30 IST

సర్వసభ్యమండలి సమావేశంతో అన్నాడీఎంకేలో ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎ్‌స)దే పైచేయి అని తేలిపోయింది.

Epsదే పైచేయి

- ఒంటరైన ఓపీఎస్‌

- ‘పన్నీర్‌’ వర్గానికి పరాభవం


చెన్నై, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): సర్వసభ్యమండలి సమావేశంతో అన్నాడీఎంకేలో ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)దే పైచేయి అని తేలిపోయింది. సమావేశంలో ఆద్యంతం ఆయనదే ఆధిపత్యం కనిపించింది. సమన్వయకర్తగా ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) సంతకాలతో సిద్ధమైన 23 తీర్మానాలను తిరస్కరించడంతోనే పార్టీలో ఆయన బలం స్పష్టమైపోయిందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. సర్వసభ్యమండలిని అడ్డుకునేందుకు పన్నీర్‌సెల్వం చేసిన ప్రయత్నాలను చివరి వరకూ విజయవంతంగా అడ్డుకున్నారు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వుల ప్రకారమే ఏకనాయకత్వంపై తీర్మానం చేయకుండా, ముందస్తు అజెండాలోని 23 తీర్మానాలు తిరస్కరణకు గురయ్యేలా చక్రం తిప్పారు. అంతటితో ఆగకుండా రాత్రికి రాత్రే సర్వసభ్యమండలి, కార్యాచరణ మండలి సభ్యులతో ఏకనాయకత్వాన్ని కోరుతూ వినతి పత్రాలపై సంతకాలు కూడా చేయించారు. ఆ మేరకే సర్వసభ్యమండలి సమావేశంలో సభ్యులందరూ రాతపూర్వకంగా ఏకనాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు పార్టీ ప్రముఖల చేత సభాముఖంగా ప్రకటింపజేశారు. సమావేశంలో అడుగడుగునా ఈపీఎస్‌ మద్దతుదారుల ప్రభావం కనిపించడంతో ఓపీఎస్‌ వర్గం అక్కడి నుంచి నిష్క్రమించాల్సివచ్చింది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఓపీఎస్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కోసమే వెళ్తున్నారని ప్రచారం జరుగుతుందడగా ఓపీఎస్‌ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించేందుకే వెళ్తున్నట్టు ప్రకటించారు. 


పన్నీర్‌కుచేదు అనుభవం...

సర్వసభ్యమండలి సమావేశ వేదికపై ఆశీనులైన ఓపీఎస్‌, ఆయన మద్దతుదారులైన పార్టీ డిప్యూటీ సమన్వయకర్త వైద్యలింగం, మాజీ శాసనసభ్యుడు జీసీడీ ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశంలో ఓపీఎస్‌ వేదిక ఎక్కినప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోలేదు. నేతలెవ్వరూ కనీసం ఆయన ముఖం కూడా చూడలేదు. దాంతో ఆయన ఒంటరిగానే మిగిలిపోయారు. ఇక ఆయన మద్దతుదారుడైన వైద్యలింగం వేదికపైకి ఎక్కగానే సర్వసభ్యమండలి సభ్యులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ద్రోహి వైద్యలింగం గో బ్యాక్‌’ అంటూ కేకలు పెట్టారు. దీంతో వైద్యలింగం వేదికపై నుండి దిగి దూరంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వేదికపైకి వెళ్లిన జేసీడీ ప్రభాకరన్‌ను కూడా కార్యకర్తలు విడిచి పెట్టలేదు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కూడా వేదిక నుంచి కిందకు దిగారు. 


ఓపీఎస్‏పై వాటర్‌ బాటిల్‌...

సర్వసభ్యమండలి సమావేశంలో ఏకనాయకత్వంపైనే ప్రధానంగా చర్చ జరగడంతో ఆగ్రహించిన ఓపీఎస్‌.. ఆయన మద్దతుదారుడైన వైద్యలింగం సభ నుంచి నిష్క్రమించేందుకు బయలుదేరారు. మధ్యలో మైకు కనిపించడంతో పార్టీ ఉపసమన్వయకర్త వైద్యలింగం చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సర్వసభ్య మండలిని బహిష్కరిస్తున్నట్లు బిగ్గరగా కేకలు వేశారు. దీంతో ఒక్కసారిగా సమావేశమందిరం అరుపులు, కేకలతో గందరగోళంగా తయారైంది. ఆ తర్వాత పన్నీర్‌సెల్వం వేదికపై నుంచి దిగి మద్దతు దారులతో కలిసి నడచివెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై వాటర్‌బాటిల్‌ను, చిత్త కాగితాలను విసిరారు. 


ఓపీఎస్‌ వాహనం టైర్‌ పంక్చర్‌

సర్వసభ్యమండలి సమావేశానికి ఓపీఎస్‌ ఎన్నికల ప్రచారవాహనంలో హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఆ వాహన టైర్‌ పంక్చర్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకుని ఓపీఎస్‌ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశాన్ని బహిష్కరించిన తర్వాత పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులు వైద్యలింగం, జేసీడీ ప్రభాకరన్‌, మనోజ్‌పాండ్యన్‌ తదితరులు కల్యాణమండపం నుంచి బయటికి వచ్చారు. పన్నీర్‌సెల్వం తన ప్రచార వాహనంలో ఎక్కబోతూ వాహనం టైరు పంక్చరైవుండడం గుర్తించారు. ఆ వెంటనే తన మద్దతుదారులకు చెందిన మరో వాహనంలో బయలుదేరి వెళ్లారు. 


పార్టీని నాశనం చేస్తున్నారు: వైద్యలింగం

ఓపీఎస్‏తో పాటు సర్వసభ్యమండలి సమావేశాన్ని బహిష్కరించిన డిప్యూటీ సమన్వయకర్త వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ... ద్రోహులంతా కలిసి పార్టీ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సర్వసభ్యమండలి సమావేశాన్ని చట్ట ప్రకారం నిర్వహించలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో తదుపరి సర్వసభ్యమండలి సమావేశం గురించి చేసిన ప్రకటన కూడా చెల్లదన్నారు.



Updated Date - 2022-06-24T15:30:52+05:30 IST