Delhi Tour: హస్తినలో Eps మకాం

ABN , First Publish Date - 2022-07-23T14:31:47+05:30 IST

ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి

Delhi Tour: హస్తినలో Eps మకాం

                    - పార్టీ సమస్యలపై మోదీ, ఈసీలకు ఫిర్యాదు?


అడయార్‌(చెన్నై), జూలై 22: ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి నాలుగు రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని నరేంద్ర మోదీనికి కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. అది ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ ఆయన అపాయింట్‌మెంట్‌ లభించేంత వరకు అక్కడే నాలుగు రోజులు పాటు  ఉండాలని భావిస్తున్నారు. ప్రధాని మోదీ కలిసే అవకాశం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం, ఆయన వర్గీయులు పార్టీలో సృష్టిస్తున్న కలహాలపై ఫిర్యాదు చేయాలన్న పట్టుదలతో ఈపీఎస్‌ ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో 95 శాతం మంది నేతలు, కార్యకర్తలు, సర్వసభ్య మండలి సభ్యులు తనకు మద్దతుగా ఉన్నారనీ, వీరంతా కలిసి తనను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయాన్ని తెలియజేయనున్నారు. ఇదే విధంగా హోం మంత్రి అమిత్‌ షాను కూడా కలుసుకుని ఓపీఎస్‌ వర్గం తెచ్చే సమస్యలను వివరించనున్నారు. అలాగే, బీజేపీకి చెందిన మరికొంతమంది జాతీయ నాయకులను కూడా కలిసి వారికి కూడా తన సమస్యలను వివరించనున్నారు. వీటితో పాటు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన అనుచరులైన కాంట్రాక్టర్లపై వరుసగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడాన్ని కూడా ఆయన బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం కాస్త ఆలస్యమైనా హస్తినలోనే మకాం వేసి అన్ని పనులను చక్కబెట్టుకుని రావాలనే ఆలోచనలో ఈపీఎస్‌ ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

Updated Date - 2022-07-23T14:31:47+05:30 IST