వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఎడ్లబండి

ABN , First Publish Date - 2021-10-17T05:28:16+05:30 IST

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శనివారం ఉదయం వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగడంతో ఎడ్లబండి కొట్టుకుపోయింది

వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఎడ్లబండి
వాగులో మునిగి మృతిచెందిన ఎద్దులు

- కాడెడ్లు మృతి

- బయటపడ్డ రైతు 

జన్నారం, అక్టోబరు 16: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శనివారం ఉదయం వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగడంతో  ఎడ్లబండి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందాయి. ఎడ్లబండిలో ఉన్న రైతు అతికష్టంపై బయటపడ్డాడు.  జన్నారం గ్రామానికి చెందిన అన్వర్‌ రోజులాగే శనివారం తన ఎడ్లబండితో జన్నారం వాగు దాటి పొలానికి వెళ్లాడు. కాగా శుక్రవారం రాత్రి నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలకు జన్నారం వాగులో వరద ఉధృతి క్రమంగా పెరిగింది. పొలం పని ముగించుకున్న అన్వర్‌  వాగు దాటుతుండగా ఎడ్లబండితో పాటు రెండు కాడెడ్లు కొట్టుకుపోయాయి. అన్వర్‌ వాగు ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయాడు. వాగు ఒడ్డు  పట్టు దొరకడంతో అతికష్టంపై పైకి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో  రెండు ఎడ్లు మృతిచెందాయి.  రెండు  నెలల క్రితమే ఎడ్లను రూ. 80 వేలకు కొనుగోలు చేశానని బాధిత రైతు కంట తడిపెట్టాడు. అనంతరం పశువైద్యాధికారి శ్రీకాంత్‌ పంచనామా నిర్వహించారు. 

Updated Date - 2021-10-17T05:28:16+05:30 IST