పరీక్షలకు యూనిఫాం తప్పనిసరి.. హిజాబ్‌కు అనుమతి లేదు

ABN , First Publish Date - 2022-04-20T15:19:01+05:30 IST

ద్వితీయ పీయూసీ పరీక్షలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయని వీటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీ సీ నాగేశ్‌ వెల్లడించారు.

పరీక్షలకు యూనిఫాం తప్పనిసరి..  హిజాబ్‌కు అనుమతి లేదు

                         - విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ 

  

బెంగళూరు: ద్వితీయ పీయూసీ పరీక్షలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయని వీటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీ సీ నాగేశ్‌ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌తోపాటు ఎలాంటి ధార్మిక వస్త్రధారణకు అనుమతినిచ్చే ప్రశ్నే లేదన్నారు. ఆయా కళాశాలలు నిర్ధారించిన యూనిఫాంను ధరించి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈనెల 22న ప్రారంభమయ్యే ద్వితీయ పీయూ పరీక్షలు మే 18 వరకు జరుగుతాయన్నారు. మొ త్తం 6,84,255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరిలో 3,46,936 మంది బాలురు కాగా 3,37,319 మంది బాలికలు ఉన్నారన్నారు. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 1076 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొబైల్‌ వెంట తెచ్చుకునే విద్యార్థు లు వాటిని బయటే నిర్ణీత ప్రదేశంలో భద్రపరుచుకునే అవకాశం ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తామని, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజధాని బెంగళూరులో అత్యధికంగా 83 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా రామనగరలో అతితక్కువగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక బెంగళూరు దక్షిణ జిల్లాలో 58,836 మంది పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. అతి తక్కువగా కొడగులో 6,048 మంది పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలిపారు. 2,152 ప్రత్యేక స్క్వాడ్‌లను జిల్లా, తాలూకా స్థాయిల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వితీయ పీయూ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌ను 81 కేంద్రాల్లో నిర్వహిస్తామని, జూన్‌ మూడోవారం నాటికి ఫలితాలు ప్రకటించాలన్నది తమ ఉద్దేశ్యమన్నారు.

Updated Date - 2022-04-20T15:19:01+05:30 IST