‘ప్రగతి భవన్’ అదిరేలా దెబ్బ కొట్టాలి..
ABN , First Publish Date - 2021-07-27T05:03:29+05:30 IST
‘ప్రగతి భవన్’ అదిరేలా దెబ్బ కొట్టాలి..
మాజీ మంత్రి ఈటల రాజేందర్
8వ రోజుకు చేరిన ప్రజాదీవెన పాదయాత్ర
కమలాపూర్, జూలై 26 : హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో ఇక్కడ దెబ్బకొడితే ప్రగతి భవన్లో కదలికలు వస్తాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెన పాదయాత్రలో భాగంగా 8వ రోజు సోమవారం మాజీ మంత్రి ఈటల మండలంలోని కమలాపూర్, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజుపల్లి, ఉప్పల్, ఉప్పలపల్లి గ్రామాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్ ఓట్లకు భయపడతాడని, హుజూరాబాద్లో తాను గెలిచిన తర్వాత తెలంగాణలో ఒక విప్లవం వస్తుందన్నారు. తన రాజీనామాతో పింఛన్లు, తెల్లరేషన్కార్డులు, గొర్రెలు వస్తున్నాయని, ఎన్నికల్లో తాను గెలిస్తే ఇంకా చాలా వస్తాయన్నారు. తాను ఎప్పుడూ గడ్డిపోచలా కాకుండా గడ్డపారలా ఉన్నానన్నారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాంచందర్రావు, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రకు వచ్చిన ఈటల రాజేందర్కు అన్ని గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. మహిళలు మంగళహారుతులు, బోనాలతో స్వాగతం పలికారు. ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల్లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కానిపర్తి గ్రామంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రామప్పకు అంతర్జాతీయ స్థాయిలో యునేస్కో వారసత్వ సంపదగా గుర్తింపు రావడంపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి ఈటల రాజేందర్, తుల ఉమ, మిథున్రెడ్డి, అశోక్రెడ్డి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.