టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది: ఈటల
ABN , First Publish Date - 2022-04-09T20:55:45+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది, 101వ తప్పుకు ప్రజలు శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది, 101వ తప్పుకు ప్రజలు శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం నిర్వహించిన కిసాన్ మోర్చా రైతు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను. తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లా. ప్రజలు టీఆర్ఎస్ను శిక్షించి నన్ను గెలిపించారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బు, సంపదకు కాపలాదారులు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ హూందాగా తన కర్తవ్వమని చెబుతారు. కేసీఆర్ నేనిచ్చానని చెబుతారు. గజ్వేల్ లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
‘‘కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటాడుతున్నారు. నేను బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఒక సందర్భంలో కేసీఆర్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఒక అవసరం ఉంటుంది. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా?. వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక జీవనం. కంప్యూటర్ యుగంలో అన్నం పెట్టేది భూతల్లి మాత్రమే. అలాంటి వ్యవస్థను కాపాడాల్సింది పోయి వరి వేస్తే ఉరి అని స్వయానా సీఎం కేసీఆర్ చెప్పడం భావ్యమా? ప్రతిపక్షాలకు ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత ఉంటుంది. ప్రజలు అధికారం ఇస్తే కుర్చీపై నుంచి వెలకిలపడి ధర్నాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదు’’ అని ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.