Kabul Bomb Blast: బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడిన కాబూల్.. 8 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2022-08-07T17:05:22+05:30 IST
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్ బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్లో రద్దీగా ఉండే ఒక షాపింగ్ స్ట్రీట్లో శనివారం నాడు బాంబు పేలుడు..
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్ బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్లో రద్దీగా ఉండే ఒక షాపింగ్ స్ట్రీట్లో శనివారం నాడు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది దాకా గాయపడ్డారు. కాబూల్ పశ్చిమ ప్రాంతంలో అది కూడా అక్కడ మైనార్టీలైన షియా తెగ వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఆ బాంబు పేలడం గమనార్హం. సున్నీ ముస్లిం మిలిటెంట్ గ్రూప్ ఈ బాంబు పేలుళ్లు తమ పనేనని ఆ సంస్థ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వెల్లడించింది.
బాంబు పేలిన ప్రాంతంలో దర్యాప్తు బృందం విచారణ జరుపుతోందని, అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సున్నీ తెగకు చెందిన ముస్లిం తాలిబన్లు గతేడాది ఆగస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుని పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఈ తెగకు చెందిన తాలిబన్ అధికారులు మాట్లాడుతూ.. షియా తెగ ప్రజలకు తాము మరింత భద్రత కల్పిస్తామని చెప్పడం కొసమెరుపు.