Maharastra Political Crisis : ముంబై బయలుదేరిన రెబల్ ఎమ్మెల్యేలు.. ఏం జరగబోతోంది..
ABN , First Publish Date - 2022-06-24T19:04:04+05:30 IST
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra Political Crisis)లో ప్రతిష్ఠంభన నాలుగవ రోజుకు చేరింది.
ముంబై : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra Political Crisis)లో ప్రతిష్ఠంభన నాలుగవ రోజుకు చేరింది. గువహటి హోటల్లో బస చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకి బయలుదేరారు. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే(Eknath Shinde) ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పయనమయ్యారు. కాగా సంక్షోభం వేళ కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలే(Ramdas Athawale) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన(Shivasena) రెబల్ నేత ఏక్నాథ్ షిండే బీజేపీ(Bharatiya Janata Party)కి మద్దతివ్వబోతున్నారని అన్నారు. ఈ వరుస పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచాయి. ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాగా శివసేన LPL(లెజిస్లేటివ్ పార్టీ లీడర్) నేతగా అజయ్ చౌదరికి ఆమోదం తెలిపిన మహారాష్ట్ర స్పీకర్ నర్హరి జరివాల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు బొంబే హైకోర్ట్(Bombay High court)కు వెళ్లే అవకాశాలున్నాయి.
నాకు 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది: ఏక్నాథ్ షిండే
తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని తిరుగుబాటు సూత్రదారి ఏక్నాథ్ షిండే(Eknath Shinde) శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇందులో 40 మంది శివసేన ఎమ్మెల్యేలని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు తమకు 2/3 వంతు మెజారిటీ ఉందన్నారు. కాగా షిండే శిబిరంలోకి మరికొంతమంది సేన ఎమ్మెల్యేలు చెరే అవకాశాలున్నాయని రిపోర్టులు వెలువడుతున్నాయి.
మెజారిటీని నిరూపించుకుంటాం: సంజయ్ రౌత్..
శివసేన సీనియర్ నేత, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(sanjay routh) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వాస పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం బలం నిరూపించుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెబల్ నేతలు ముంబై రావాలని డిమాండ్ చేశారు. అవసరమైన పార్టీ శ్రేణులు వీధుల్లోకి వస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ యుద్ధం చట్టపరమైన, శాసనపరమైనదిగా మారిపోయిందన్నారు. ఏక్నాథ్ షిండేని బీజేపీ నియంత్రిస్తోందని ఆరోపించారు.