Shinde takes oath as Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-07-01T01:35:19+05:30 IST
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా..
ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో.. ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది. 1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్నాథ్ షిండే ఎంట్రీ ఇచ్చారు. శివసేనలో చేరి కార్పొరేటర్గా గెలిచారు.
మాస్ లీడర్గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొప్రి-పచ్పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.