359 మందికి కోడ్ ఉల్లంఘన నోటీసులు
ABN , First Publish Date - 2021-03-09T06:00:47+05:30 IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 359 మందికి నోటీసులు జారీ చేసింది.
గుంటూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 359 మందికి నోటీసులు జారీ చేసింది. చీరలు, ప్రెషర్ కుక్కర్లు, నగదు పంపిణీ, పోస్టర్లు, స్టిక్కర్లు, కరపత్రాలు, జెండాల తొలగింపు వంటి ఉల్లంఘన కింద ఈ నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. గుంటూరు నగరంలో అత్యధికంగా 120 మంది, తెనాలిలో 48, చిలకలూరిపేటలో 55, రేపల్లెలో 32, సత్తెనపల్లిలో 34, వినుకొండలో 70 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఐదు మునిసిపాలిటీలు, నగరపాలకసంస్థలో ఏర్పాటు చేసిన 24 చెక్పోస్టుల్లో 240.66 లీటర్ల మద్యం సీజ్ చేసి 43 మంది నిందితులను అరెస్టు చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు 18 ఫిర్యాదులు రాగా వాటిని సంబంధిత అధికారులకు పంపించి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.53 లక్షల 82 వేల 90 సీజ్ చేసి, 17 మందిపై 9 కేసులు నమోదు చేశారు. వైసీపీకి చెందిన వారిపై రెండు, టీడీపీకి చెందిన నాయకులపై మూడు, జనసేనకు చెందిన వారిపై రెండు, ఇతరులపై మరో రెండు కేసులు నమోదు చేశారు. రూ.20 వేల విలువ చేసే 18 ప్రెషర్ కుక్కర్లు, రెండు ఆటోలు, ఒక డీజే బాక్సు, జనరేటర్, ట్రాక్టర్, రెండు కార్లని కూడా సీజ్ చేశామని అధికారులు తెలిపారు.