
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
''ఏటా ఫిబ్రవరి 16న జరిగే శ్రీ గురు రవిదాస్ జీ జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పంజాబ్ ప్రజలు యూపీలోని వారణాసికి వెళ్తుంటారని రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తెచ్చారు. 14న ఎన్నికలు ప్రకటించడం వల్ల వారంతా ఓటింగ్లో పాల్గొనే అవకాశాం కోల్పాతారని విన్నవించారు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, చీఫ్ ఎలక్టోరల్ అధికారి నుంచి సమాచారం తీసుకుంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించాం'' అని ఈసీ ఆ ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు, ఎన్నికల తేదీని వాయిదా వేయాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సుభాష్ శర్మ ఈసీకి వేర్వేరు లేఖలు రాశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం ఈ డిమాండ్ను సమర్ధించారు.