మంత్రి శ్రీనివాస్గౌడ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ABN , First Publish Date - 2022-01-25T23:35:06+05:30 IST
తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఉచ్చు బిగుస్తోంది. 2018 మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్గౌడ్ అక్రమాలకు ..
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికల అఫిడవిట్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అందిన ఫిర్యాదులపై చర్యలకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. 2018 మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాసగౌడ్ 14.11.2018న నామినేషన్ దాఖలు చేశారు. దీనిని ఈసీ తమ వెబ్ సైట్లో అప్లోడ్ చేసింది.
అయితే, ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది ప్రత్యక్షమైంది. తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్ను తెలంగాణ ఈసీ అధికారులతో కుమ్మక్కై అప్లోడ్ చేయించినట్లు శ్రీనివాసగౌడ్పై ఆరోపణలు ఉన్నాయి.
పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది కనిపించడంతో శ్రీనివాస్ గౌడ్ బాధితులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్రై ఈసీ వెబ్ సైట్ను ట్యాంపరింగ్ చేసినట్లు అందులో ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో నివేదిక తెప్పించుకుంది.
ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్ గోయల్ బదిలీపై వెళ్లారు. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ ఆయన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది. ఇది నిజమేనని తేలితే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం ఉంది.