100 శాతం ఓటింగ్‌కు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-03-06T06:17:44+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు 100 శాతం ఓటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

100 శాతం ఓటింగ్‌కు కృషి చేయాలి
మునిసిపల్‌ ఎన్నికల ఏర్పాట్లని సమీక్షిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలు

గుంటూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు 100 శాతం ఓటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మునిసిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి కమిషనర్లు, సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరిగిందా, లేదా అని సీనియర్‌ అధికారులు ర్యాండమ్‌గా వెళ్లి తనిఖీ చేయాలన్నారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ వివరాలు వార్డుల వారీగా అందించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఓటు వేసే సందర్భంలో వీల్‌చైర్‌ల ఏర్పాటు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్ల వంటివి తప్పక ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టాలన్నారు. కోడ్‌ ఉల్లంఘనలపై వెంటనే నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్లని ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. వినుకొండ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల పరిశీలకుడు డాక్టర్‌ పీ లక్ష్మీనరసింహం హాజరై కొన్ని సూచనలు చేశారు.  రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడుతూ  పోలీసు గస్తీని మరింత పెంచుతున్నామన్నారు. 

ఎన్నికల కోడ్‌ని పాటించాలి

మునిసిపల్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మునిసిపల్‌ ఎన్నికలపై శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 188 సమస్యాత్మక, 365 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించామన్నారు. ఓటర్లు ఓటు ఏ పోలింగ్‌ బూత్‌లో ఉందో తెలుసుకునేందుకు ప్రతీ వార్డు సచివాలయంలో హెల్ప్‌డెస్కుని ఏర్పాటు చేశామన్నారు. ఆయా సమావేశాల్లో జేసీలు దినేష్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, ప్రశాంతి, మునిసిపల్‌ ఆర్‌డీ శ్రీనివాసులు, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి, అర్బన్‌ జిల్లా అదనపు ఎస్‌పీ గంగాధర్‌, రూరల్‌ జిల్లా డీసీఆర్‌బీ డీఎస్‌పీ జీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:17:44+05:30 IST