Elections ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధం: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-07-11T21:35:58+05:30 IST
ఎన్నికల తేదీని సీఈసీ ప్రకటిస్తుందని, ఎన్నికలు (Elections) ఎప్పుడు వచ్చినా బీజేపీ (BJP) సిద్ధంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు
కరీంనగర్: ఎన్నికల తేదీని సీఈసీ ప్రకటిస్తుందని, ఎన్నికలు (Elections) ఎప్పుడు వచ్చినా బీజేపీ (BJP) సిద్ధంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి పూట కేసీఆర్ చేసే సవాళ్లను ఎవరూ నమ్మరని ఎద్దేవాచేశారు. బీజేపీని దోషిని చేసి రాజకీయ లబ్ది పొందాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ (KCR) సవాల్ను స్వీకరిస్తామని ప్రకటించారు. తెలంగాణలో చర్చ జరగాలనే కేసీఆర్ ముందస్తు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలు తాము చెప్తేనే జరిగాయా? అని సంజయ్ ప్రశ్నించారు.
అసెంబ్లీ రద్దుకు రెడీ: కేసీఆర్
‘‘బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా. అందరం ఎన్నికలకు పోదాం. ఇలాంటి చిల్లర మాటలతోని కేసీఆర్ను కొడతారా? దెబ్బతీస్తారా? ఇంత కురచ ఆలోచనా? ఇది మంచిది కాదు. ఒకవేళ ముందస్తుకు పోతే కేసీఆర్ను తట్టుకుంటారా? కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వస్తే.. రైతుబంధు, దళితబంధు ఇస్తానని ప్రజలకు చెప్తాడు. అదే జరిగితే మన కొంప మునుగుతది. అని బీజేపీ భయపడుతోంది’’ అని కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు.