అవగాహనతో ఎన్నికలను నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-02T06:00:57+05:30 IST
మహా విశాఖ నగర పాలక సంస్థకు ఈనెల పదో తేదీన జరగనున్న ఎన్నికల్లో విధులు చేపట్టే అధికారులు పూర్తి అవగాహనతో ఎన్నికలను నిర్వహించాలని అదనపు ఎన్నికల అఽథారిటీ, జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి సూచించారు.
అదనపు ఎన్నికల అథారిటీ, జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి
వెంకోజీపాలెం, మార్చి 1: మహా విశాఖ నగర పాలక సంస్థకు ఈనెల పదో తేదీన జరగనున్న ఎన్నికల్లో విధులు చేపట్టే అధికారులు పూర్తి అవగాహనతో ఎన్నికలను నిర్వహించాలని అదనపు ఎన్నికల అఽథారిటీ, జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి సూచించారు. సోమవారం జీవీఎంసీ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ మేజిస్ర్టేట్లు, జోనల్ కమిషనర్లకు మాస్టర్ ట్రైనర్స్చే మూడో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్స్ ఇచ్చిన సూచనలపై అందరూ పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, తదితర అంశాలపై పూర్తిగా అవగాహన ఉంటే పోలింగ్ సిబ్బంది విధులు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల పంపిణీ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, తదితర ప్రక్రియలు సజావుగా సాగుతాయని నాగలక్ష్మి వివరించారు.
24 మండలాల్లో పీవోలు, ఏపీవోలకు శిక్షణ
జీవీఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సుమారు 4,300 మంది పీవోలు, ఏపీవోలకు 24 మండల కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్చే శిక్షణినిచ్చే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏడీసీ ఏవీ రమణి, జీవీఎంసీ సలహాదారు జీవీవీఎస్ మూర్తి, నోడల్ అధికారి బీవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.