ధర్మవరం-పాకాల మధ్య విద్యుత్ రైలు పరుగులు
ABN , First Publish Date - 2022-08-10T04:19:19+05:30 IST
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా పాకాల మార్గంలో మంగళవారం తొలి విద్యుత్ రైలు పరుగులు తీసింది.
ధర్మవరం నుంచి నర్సాపురం వెళ్లే రైలుకు విద్యుత్ ఇంజన్
త్వరలోనే పూర్తి స్థాయిలో విద్యుత్ రైళ్ల రాకపోకలు
ములకలచెరువు, ఆగస్టు 9: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా పాకాల మార్గంలో మంగళవారం తొలి విద్యుత్ రైలు పరుగులు తీసింది. ధర్మవరం నుంచి ములకలచెరువు, మదనపల్లె రోడ్డు, వాయల్పాడు, కలికిరి, పీలేరు, తిరుపతి మీదుగా ప్రతిరోజూ నడిచే ధర్మవరం-నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు డీజిల్ ఇంజన్ తొలగించి కరెంటుతో నడిచే ఇంజన్ను తగిలించారు. దీంతో కొత్తగా ఏర్పడ్డ ధర్మవరం-పాకాల మార్గంలో తొలి విద్యుత్ రైలు పరుగులు పెట్టింది. ధర్మవరం నుంచి పాకాల వరకు వరకు రూ.390 కోట్లతో 227 కిలోమీటర్లు చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో ధర్మవరం నుంచి కదిరి వరకు చేపట్టిన పనులు గత ఏడాది డిసెంబరులో, రెండో విడతగా చేపట్టిన శ్రీసత్యసాయి జిల్లా కదిరి నుంచి ములకలచెరువు మీదుగా బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట వరకు, కలికిరి నుంచి పాకాల వరకు చేపట్టిన విద్యుదీకరణ పనులు ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. ఈ మార్గంలో మిగిలిన తుమ్మణంగుట్ట నుంచి కలికిరి వరకు చేపట్టిన పనులు తాజాగా ముగియడంతో ఈనెల 6వ తేదీ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సోమేశ్కుమార్, గుంతకల్లు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం మురళీకృష్ణ తనిఖీ చేసిన విషయం విదితమే. అలాగే కొత్త విద్యుదీకరణ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. అది విజయవంతం కావడంతో విద్యుత్తో నడేచే రైళ్లు నడిపేందుకు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో ధర్మవరం నుంచి నర్సాపూర్కు వెళ్లే రైలుకు విద్యుత్ ఇంజన్ తగిలించి నడిపారు. అలాగే నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా డీజిల్ ఇంజన్ తొలగించి విద్యుత్ ఇంజన్ను అమర్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విద్యుత్తో నడిచే రైళ్లను నడిపేందుకు రైల్వే ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. దీంతో కొత్త విద్యుదీకరణ మార్గంలో డీజిల్ ఇంజన్లకు స్వస్తి చెప్పనున్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్తో రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి.