తెగిన వైరు.. ఆగిన రైళ్లు
ABN , First Publish Date - 2022-05-11T13:20:42+05:30 IST
స్థానిక వ్యాసార్పాడి - వావుసి రైల్వేస్టేషన్ వద్ద హై ఓల్టేజీ విద్యుత తీగె తెగిపడటంతో సెంట్రల్ - తిరువళ్లూరు మార్గంలో మంగళవారం ఉదయం రైళ్ల రాకపోకలకు తీవ్ర
- వ్యాసార్పాడి వద్ద తెగిపడిన విద్యుత్ తీగలు
- సెంట్రల్- తిరువళ్లూరు మధ్య రైలు సేవలకు అంతరాయం
పెరంబూర్(చెన్నై): స్థానిక వ్యాసార్పాడి - వావుసి రైల్వేస్టేషన్ వద్ద హై ఓల్టేజీ విద్యుత తీగె తెగిపడటంతో సెంట్రల్ - తిరువళ్లూరు మార్గంలో మంగళవారం ఉదయం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా బీచ్ - తాంబరం మార్గంలో విద్యుత్ లోకల్ రైళ్లు ఆలస్యంగా నడపటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ మార్గంలో అక్కడక్కడా పలు రైళ్లను ఆపివేశారు. ఆ తర్వాత అవన్నీ నత్తనడకన నడిచాయి. ఈ నేపథ్యంలో వ్యాసార్పాడి స్టేషన్ వద్ద హైఓల్టేజీ విద్యుత్ తీగె తెగిపడటంతో సెంట్రల్ - తిరువళ్లూరు మార్గంలో విద్యుత్ లోకల్ రైళ్ళ సేవలకు అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ - అరక్కోణం మార్గంలో విద్యుత్ రైళ్లు అక్కడక్కడా నిలిపేశారు. సబర్బన్ ప్రాంతాల నుంచి సెంట్రల్ మూర్మార్కెట్ కాంప్లెక్స్కు రావాల్సిన రైళ్లు కూడా సక్రమంగా నడవ లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సెంట్రల్ స్టేషన్ నుంచి ఎక్స్ప్రెస్ రైళ్లు నడిపే మార్గాల్లో విద్యుత్ రైళ్లను నడపటంతో ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఆ స్టేషన్కు వెళ్ళి విద్యుత్ రైళ్లలో ప్రయాణించారు. దీంతో ఆయా రైళ్లు, రైల్వే స్టేషన్ జనంతో క్రిక్కిరిసిపోయాయి. కాగా వ్యాసార్పాడి వద్ద తెగిన విద్యుత్ తీగను సరిచేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆ తర్వాత ఆ మార్గంలో యధావిధిగా రైళ్ల సేవలను ప్రారంభమయ్యాయి. అయితే రైళ్లలోకి ప్రయాణీకులు ఒక్కసారిగా ఎగబడడంతో మూర్మార్కెట్ స్టేషన్ జనసంద్రంగా తయారైంది.