20 శాతం పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
ABN , First Publish Date - 2022-03-10T15:42:29+05:30 IST
విద్యుత్ ఛార్జీలను 20 శాతం పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల నిర్ణయం, బోర్డు పర్యవేక్షణ, విద్యుత్ బోర్డు, విద్యుత్ సంస్థల మధ్య సమస్యలు పరిష్కరించడం వంటి పనులు
ఐసిఎఫ్(చెన్నై): విద్యుత్ ఛార్జీలను 20 శాతం పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల నిర్ణయం, బోర్డు పర్యవేక్షణ, విద్యుత్ బోర్డు, విద్యుత్ సంస్థల మధ్య సమస్యలు పరిష్కరించడం వంటి పనులు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ చేపడుతోంది. బోర్డు విద్యుత్ ఛార్జీల వివరాలను ప్రతి ఏటా నవంబరులోగా కమిషన్కు సమర్పిస్తోంది. దానిని పరిశీలించిన కమిషన్ ఖర్చులు అదనంగా ఉంటే ఛార్జీలు పెంచడం, తక్కువగా ఉంటే ఛార్జీలు తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటుంది. విద్యుత్ ఛార్జీలు పెంచే సమయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వాటి ఆధారంగా ఏప్రిల్ మొదటి వారంలో కొత్త ఛార్జీలు అమలుచేస్తుంటారు. ఆర్ధిక లోటు కారణంగా 2014లో 15 శాతం ఛార్జీలు పెంచారు. ఆ తర్వాత 2019లో 30 శాతం పెంచేందుకు నిర్ణయించిన కమిషన్, ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల కారణంగా నిర్ణయం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ బోర్డు రుణాలు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో, 20 శాతం వరకు ఛార్జీలు పెంచేందుకు అనుమతించాలని విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్కు విద్యుత్ బోర్డు ప్రతిపాదించింది.