అంత్యక్రియలకు ఏనుగును మోసుకెళ్లలేక ఇలా...

ABN , First Publish Date - 2021-10-09T21:02:15+05:30 IST

బురదలో కూరుకుపోయి చనిపోయిన నాలుగేళ్ల ఓ ఏనుగు కళేబరాన్ని అటవీ సిబ్బంది..

అంత్యక్రియలకు ఏనుగును మోసుకెళ్లలేక ఇలా...

కోయంబత్తూరు: బురదలో కూరుకుపోయి చనిపోయిన నాలుగేళ్ల ఓ ఏనుగు కళేబరాన్ని అటవీ సిబ్బంది 15 ముక్కలుగా కత్తిరించి అక్కడి నుంచి అంత్యక్రియలకు తరలించారు. చనిపోయిన చోటే అంత్యక్రియలకు స్థానికులు అభ్యంతరం చెప్పడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహాలో ఏనుగు కళేబరాన్ని ముక్కలు చేసి అంత్యక్రియలు జరపడం ఇదే మొదటిసారని వారు చెప్పారు. నీలగిరిలోని మాళవన్ చేరంపాడిలో ఈ ఘటన చోటుచేసుకుంది.




ఈనెల 2న బురదలో చిక్కుకుపోయి ఏనుగు చనిపోయిన ఘటన తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఏనుగుల మంద ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టగానే చనిపోయిన ఏనుగును తాము బయటకు తీశామని చెప్పారు. ఏనుగు వయస్సు, లింగ నిర్ధారణ, మరణానికి కారణాలను నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం జరిపామని చేరంపాడి ఫారెస్ట్ రేంజ్ అధికారి జి.రామకృష్ణన్ తెలిపారు. ఏనుగు మరణించిన చోటే అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ స్థానికులు పక్కనే ఉన్న పంచాయతీ బావి కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆయన వివరించారు. దీంతో సుమారు 1500 కిలోల బరువును ఏనుగు కళేబరాన్ని సుమారు 15 ముక్కలుగా కత్తిరించి వేరే ప్రదేశానికి తరలించి అక్కడ అంత్యక్రియలు జరిపినట్టు చెప్పారు. గుడలూర్ డీఎఫ్ఓ వెంకటేష్ ప్రభు సమక్షంలో ఫారెస్ట్ వెటరినేరియన్ డేవిడ్ మోహన్ ఈ పోస్ట్‌మార్టం నిర్వహించినట్టు రామకృష్ణన్ తెలిపారు.

Updated Date - 2021-10-09T21:02:15+05:30 IST