ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-24T06:22:25+05:30 IST

గోదావరి పరివాహ క ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు గురు వారం అర్ధరాత్రి ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని కిందకు వదిలారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత
వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువస్తున్న ఎమ్మెల్యే, పోలీసులు

కోల్‌సిటీ, జూలై 23: గోదావరి పరివాహ క ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు గురు వారం అర్ధరాత్రి ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని కిందకు వదిలారు. ప్రాజెక్టు 40గేట్లు ఎత్తి 8.7లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో రామగుండం నియోజకవర్గ ప రిధిలోని మల్కాపూర్‌, జనగామ, గోదావరిఖని ప్రాంతాలను వరద కప్పేసింది. మున్సిపల్‌ ఇన్‌టేక్‌వెల్‌ పక్క నుంచి ఎస్‌టీపీ వరకు నీట మునిగింది. ఆ ప్రాంతంలోని ఒక సిమెంట్‌ బ్రిక్స్‌ ప్లాంట్‌లో పని చేస్తున్న 35 మంది కార్మిక కుటుంబాలు వరదల్లో చిక్కుక్కున్నాయి. వారు నిద్రనుంచి తేరుకునే సరికే వరదల్లో చిక్కుకున్నారు. దీంతో ప్లాంట్‌ ఆవరణలో బిల్డింగ్‌ ఎక్కారు. ఉదయం 5గంటలకు సమాచారం రావడంతో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, ఏసీపీ ఉమేందర్‌, గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రమేష్‌బాబు, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, సింగరేణి రెస్క్యూ మేనేజర్‌ మాధవరావు ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. తాళ్ల సహకారంతో ఎమ్మెల్యే, ఏసీపీ, రామగుండం సీఐ, రెస్క్యూ సిబ్బంది కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 

Updated Date - 2021-07-24T06:22:25+05:30 IST