ఏలూరు మాస్టర్ ప్లాన్ రూపొందించాలి : జేసీ
ABN , First Publish Date - 2021-12-08T05:15:26+05:30 IST
ఏలూరు మాస్టర్ ప్లాన్ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందించాలని జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
ఏలూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి):ఏలూరు మాస్టర్ ప్లాన్ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందించాలని జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఏలూరు మాస్టర్ ప్లాన్ రూపొంది స్తున్న ప్రాజెక్టు కన్సల్టెన్సీ బృందం, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యం లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భాగంగా మాస్టర్ ప్లాన్ రూపిందిస్తారన్నారు. కొమడవోలు, చొదిమెళ్ల, పోణంగి ప్రాంతాల్లో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతారని, వాటిని పేదలకు కేటాయించే సందర్భంలో ఆయా ప్రాంతాలలో జీవనోపాధిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 1975లో మాన్యువల్గా రూపొందించిన ఏలూరు మాస్టర్ ప్లాన్ను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని జీఐఎస్ ఆధారంగా తిరిగి రూపొందించాలన్నారు. ఈ ప్రణాళికలో ఏలూరు రూరల్లో కొంతప్రాంతం, తంగెళ్లమూ డి, సత్రంపాడు, వట్లూరు, శనివారపుపేట, గవరవరం, కొమడ వోలు, చొదిమెళ్ల, దొండపాడు ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. పటిష్ట మైన డ్రెయినేజీ వ్యవస్థ, కాలువ గట్ల పటిష్టత, పచ్చదనం, వరద ముంపును ఎదుర్కొనేలా నిర్మాణం, మురుగు, వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ తదితర అంశాలను శాస్త్రీయంగా ప్లాన్లో కూర్చాలని ఆయన సూచించారు. సమావేశంలో జేసీ పద్మావతి, ఏలూరు యుడా చైర్పర్సన్ ఈశ్వరి, కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.