India-UAE travel: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2021-06-20T17:03:00+05:30 IST
భారత ప్రయాణికులపై ఈ నెల 23 నుంచి దుబాయ్ ప్రయాణ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయ్: భారత ప్రయాణికులపై ఈ నెల 23 నుంచి దుబాయ్ ప్రయాణ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ ఆమోదించిన కరోనా టీకాలను రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికులు దుబాయ్ వచ్చేందుకు అర్హులని, జూన్ 23 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని దుబాయ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సుప్రీం కమిటీ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇదే రోజు(23వ తేదీ) నుంచి భారత్కు విమాన సర్వీసులు పున:ప్రారంభిస్తామని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తెలియజేసింది. భారత్తో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియాలకు విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను ఎయిర్లైన్స్ తెలియజేసింది.
* ప్రయాణికులందరూ జర్నీకి 4 గంటల ముందు రాపిడ్ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి
* దుబాయ్ చేరుకున్న తర్వాత మరోసారి పీసీఆర్ టెస్టు తప్పనిసరి
* ఈ పీసీఆర్ పరీక్ష ఫలితం వచ్చే వరకు(ఇది 24 గంటలలోపు అందుతుందని అంచనా) ప్రయాణికులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి
* ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ సమర్పించాలి
* కేవలం క్యూఆర్ కోడెడ్ నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికేట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు