నిరసన మంటలు
ABN , First Publish Date - 2022-01-20T06:17:10+05:30 IST
పీఆర్సీ జీవోలకు వ్యతి రేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమ సెగలు రెండో రోజు బుధవారం కూడా కొనసాగాయి. ఏపీ ఎన్జీవోల సంఘం, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ–అమరావతి ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఫైర్స్టేషన్ సెంటర్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతు లను దహనం చేశారు.
పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆందోళనలు
జిల్లావ్యాప్తంగా జీవో ప్రతుల దహనం
ఇదో రాక్షస పాలనంటూ తీవ్ర విమర్శలు
ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు హెచ్చరిక
ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 19 : పీఆర్సీ జీవోలకు వ్యతి రేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమ సెగలు రెండో రోజు బుధవారం కూడా కొనసాగాయి. ఏపీ ఎన్జీవోల సంఘం, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ–అమరావతి ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఫైర్స్టేషన్ సెంటర్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతు లను దహనం చేశారు. ఇటువంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు, కార్మికులను కలుపుకుని ఫిబ్రవరి ఒకటి నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. తక్షణమే చీకటి జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎస్ హరనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా ఇచ్చిన పీఆర్సీని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామన్నారు. పీఆర్సీ ని ఉద్యోగులం దరూ వ్యతిరేకిస్తున్నారని వివరించారు. ముఖ్య మంత్రిని ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు రావత్ సత్యనారా యణ, శశిభూషణ్కుమార్లతోపాటు ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల అసంతృప్తి జ్వాల ప్రారంభమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 36 నెలల్లో అనేక వందల జీవోలను వెనక్కి తీసుకు న్నట్టుగానే పీఆర్సీ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవోలను ఉపసంహరించుకోకపోతే అందరూ సమ్మె బాట పడతారని, మార్చిలో జరిగే విద్యార్థుల పరీక్షలను అడు ్డకుంటామని, ఆర్టీసీ బస్సులను తిరగనివ్వబోమని హెచ్చరిం చారు. ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ మాట్లాడుతూ చీకటి జీవోలతో ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిం దన్నారు. ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఉద్యోగులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పాత ఐఆర్ ప్రకారం 27 శాతం ఫిట్మెంట్, పాత హెచ్ఆర్ఏ స్లాబ్లను కొనసాగించాలని కోరారు.
నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్మెంట్ను వ్యతిరేకిస్తూ ఆ మేరకు జారీ చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గురువారం నిర్వహించతలపెట్టిన ఏలూరు కలెక్టరేట్ ముట్టడికి మద్దతు ఇస్తూ తాము పాల్గొంటున్నట్టు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ–అమరావతి ఐక్య వేదిక జిల్లా నాయ కులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, జేఏసీ భాగస్వామ్య సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలని హరనాఽథ్, కె.రమేష్కుమార్లు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ నిర్ణయాలు దారుణం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్
భీమవరం : పీఆర్సీకి సంబంధించి ప్రభు త్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విడుదల చేసిన జీవోల పట్ల ఉద్యోగులు చాలా నిరాశగా ఉన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు పోవడం దారుణం. కొత్తగా మార్పులు చేయకపోయినా ఉన్న అలవెన్స్లు తగ్గించడం ఉద్యోగులపై చిన్న చూపే అవుతుంది. త్వర లో మున్సిపల్ శాఖ తరపున మున్సిపల్ కమిషనర్లు, సబార్డినేట్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, కార్పొరేషన్, కార్మిక ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఉద్యమ నిర్ణయం తీసుకుంటాం.
జీవో రద్దుచెయ్యాలి
భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పెనుమంట్ర : ఉద్యోగులకు పీఆర్సీ, హెచ్ఆర్ఏ విషయంలో అన్యాయం జరుగుతోంది. కనీసం 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి, పాత విధానంలోనే హెచ్ఆర్ఏ కొనసాగించాలి. సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు నిలుపుదల చేసి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టాలి. లేదంటే ప్రభుత్వ ఉద్యోగులందరం దశల వారీగా ఉద్యమం చేపడతాం.
అదో పనికిమాలిన జీవో : ఎమ్మెల్సీ సాబ్జీ
దేవరపల్లి, జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తగ్గించడం, ఐదు, ఆరు పీఆర్సీలను ఎగ్గొట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ విమర్శించారు. రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పలికి మాలిన జీవోల వల్ల ఉపాధ్యాయులకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. దేవరపల్లిలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు సరిపడా లేరని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ తదితర అంశాలపై ఈ నెల 20న కలెక్టరేట్ను ముట్టడిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 25న ఛలో విజయవాడ ఉంటుందని, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు శంకరుడు, ఓరుగంటి శివ నాగప్రసాదరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.