గుండ్లు గీసుకుని... చెప్పులతో కొట్టుకున్న ఉద్యోగులు
ABN , First Publish Date - 2022-05-02T00:06:16+05:30 IST
పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారన్న ఆశతో ఓట్లు వేసి గెలిపించినందుకు మోసం చేశారంటూ సీఎం జగన్ తీరును విమర్శిస్తూ
విజయనగరం: పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారన్న ఆశతో ఓట్లు వేసి గెలిపించినందుకు మోసం చేశారంటూ సీఎం జగన్ తీరును విమర్శిస్తూ విజయనగరంలో ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. గుండ్లు గీసుకుని, చెప్పులతో కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ‘విశ్వాస ఘాతుకం’ పేరుతో ఆదివారం నిరసన సభ నిర్వహించారు. తొలుత పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు గుండ్లు గీసుకున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు చెప్పులతో కొట్టుకుంటూ ఆందోళన చేశారు. నమ్మించి మోసం చేయడం వల్ల తమను తాము చెప్పులతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటం సరికాదని, రీకాల్ చేయాలంటూ కలెక్టరేట్లో ఉన్న మహాత్మాగాంధీ, డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతినిచ్చారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకూ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.