ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-08-03T05:25:09+05:30 IST
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను చెల్లించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు.
- మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి
- టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా
నంద్యాల, ఆగస్టు 2: ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను చెల్లించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులను చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు సాగుతుండటం కోర్టు ధిక్కారమేనని అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారని, వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండారెడ్డి, ఖలీల్, వెంకటేశ్వర్లు, విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం ర్యాలీ నిర్వహించి, ఎంపీడీవో శివనాగప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్, టీడీపీ నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఉపాధి హామీ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని బిల్లులు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. సీఎం జగన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే ఓ పనిగా చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో వేసిన రోడ్లే కనబడుతున్నాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అయినా రోడ్లు అభివృద్ధి చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, విజయుడు, మురళీధర్ రెడ్డి, యాసిన్భాషా, నారాయణ పాల్గొన్నారు.