ఇక సిఫార్సులు చెల్లవు

ABN , First Publish Date - 2021-12-06T05:35:11+05:30 IST

ఇటీవల తరుచుగా ఉద్యోగులు వ్యక్తిగత/మెడికల్‌ గ్రౌండ్‌తో బదిలీలకు సంబంధించి మంత్రులు/ఎంపీల నుంచి లేఖలు తీసుకొచ్చి నివేదిస్తున్నారు.

ఇక సిఫార్సులు చెల్లవు

బదిలీ లేఖలు సీసీఎస్‌ రూల్స్‌కు విరుద్ధం

ప్రజాప్రతినిధుల లేఖ తెస్తే క్రమశిక్షణా చర్యలు 

డీవోపీటీ ఆదేశాలతో ఉద్యోగుల్లో మార్పు వచ్చేనా


గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఇటీవల తరుచుగా ఉద్యోగులు వ్యక్తిగత/మెడికల్‌ గ్రౌండ్‌తో బదిలీలకు సంబంధించి మంత్రులు/ఎంపీల నుంచి లేఖలు తీసుకొచ్చి నివేదిస్తున్నారు. ఇది సీసీఎస్‌(కాండక్ట్‌ రూల్స్‌), 1964 రూల్‌ నెంబరు 20కి పూర్తి విరుద్ధం. ఈ నేపథ్యంలో ఇకపై ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తన బదిలీ కోసం ఏ ఒక్కరితోనూ సిఫార్సు చేయించరాదని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. అలా కాకుండా ఎవరైనా ఉల్లంఘించి సిఫార్సులు చేయిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్గత బదిలీలకు సంబంధించి డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీవోపీటీ) శాఖ తాజాగా విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీవోపీటీ మెమోరాండం ఆదివారం వెలుగులోకి రావడంతో జిల్లా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌, డీటీ, ఆర్‌ఐ, వీఆర్‌వో తదితర క్యాడర్ల ఉద్యోగులు తమ బదిలీల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సిఫార్సు చేయించుకుంటుంటారు. నేరుగా వారి వద్దకు వెళ్లి లేఖ తెచ్చి ఇస్తున్నారు. ఆర్‌డీవో, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారుల బదిలీలు అయితే సచివాలయ స్థాయిలో జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల క్యాడర్‌ బలం కంటే ఎక్కువ బదిలీలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వీఆర్‌వోల బదిలీల విషయంలో ఇలా జరిగింది. ఒక క్యాలెండర్‌ సంవత్సరం తిరగకుండానే సగటున ఒక్కో వీఆర్‌వో మూడు బదిలీలు అందుకున్నారు.


ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం

ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా తమ నియోజకవర్గంలోని తహసీల్దార్లు, డీటీలను మార్చేయమని ఉన్నతాధికారులకు లేఖలు పంపుతున్నారు. తాజాగా ఐదుగురు తహసీల్దార్లను బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు సిఫార్సు చేయగా ఆ ఫైలు జాయుంట్‌ కలెక్టర్‌ స్థాయి వరకు కూడా వెళ్లింది. అయితే ప్రస్తుతం ఓటర్‌ జాబితాల సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఏఈఆర్‌వోలు అయిన తహసీల్దార్లను బదిలీ చేయడానికి వీల్లేదని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆ ఫైలును వెనక్కు పంపినట్లు రెవెన్యూవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరో నెలలో ఓటర్‌ జాబితాల సవరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పటికి మరో 10 మంది తహసీల్దార్ల బదిలీల ప్రతిపాదనలు సిద్ధం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా డీవోపీటీ జారీ చేసిన ఆదేశాలు చూసి అయినా ఉన్నతాధికారులు తగిన విధంగా చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా సిఫార్సు చేయిస్తే ఒకరిద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇతర ఉద్యోగులు తమకు పోస్టింగ్‌లు కావాలని ఒత్తిడి చేయరు. 


Updated Date - 2021-12-06T05:35:11+05:30 IST