జమ్మూకశ్మీరులో Encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-12-25T13:39:54+05:30 IST

జమ్మూకశ్మీరులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం...

జమ్మూకశ్మీరులో Encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

షోపియాన్:జమ్మూకశ్మీరులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరుగుతున్న భీకర ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.శనివారం తెల్లవారుజామున షోపియాన్‌ జిల్లాలోని చౌగామ్ గ్రామంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఎదురుకాల్పులను ధృవీకరిస్తూ కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.ఉగ్రవాదుల సంచారం గురించి నిర్దిష్ట సమాచారం అందడంతో భద్రతా బలగాలు, పోలీసులు, స్థానిక ఆర్మీ యూనిట్ సంయుక్త బృందం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.


శోధిస్తున్న భద్రతాబలగాలు ఉగ్రవాదులున్న ఇంటిని చుట్టుముట్టడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇది ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని,ఉగ్రవాదులకు లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ వారు అందుకు నిరాకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి.అయితే ఆ ప్రాంతంలో చిక్కుకున్న అసలు ఉగ్రవాదుల సంఖ్య ఆపరేషన్ ముగిసిన తర్వాత తెలుస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.గత 48 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్‌ జరిగింది. శుక్రవారం అనంత్‌నాగ్‌లోని అరివానీ గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని హతమార్చినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. సంఘటన స్థలం వద్ద నుంచి ఒక ఏకే 47 రైఫిల్  మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-12-25T13:39:54+05:30 IST