దున్నేసిన బుమ్రా.. 110 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

ABN , First Publish Date - 2022-07-13T01:17:47+05:30 IST

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా దెబ్బకు విలవిల్లాడిన

దున్నేసిన బుమ్రా.. 110 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

లండన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. క్రీజులోకి వచ్చినంత వేగంగా బ్యాటర్లు వెనక్కి వెళ్లారు. ఏకంగా ఆరు కీలక వికెట్లను పడగొట్టిన బుమ్రా కెరియర్ బెస్ట్ నమోదు చేశాడు. అంతేకాదు, భారత్‌పై ఇంగ్లండ్‌కు వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 


టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టుకు ఏ దశలోనూ కలిసి రాలేదు. భారత బౌలర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగే బంతులు విసిరారు. వాటిని కాచుకోలేక బ్యాటర్లు పెవిలియన్ పట్టారు. బుమ్రాకు షమీ తోడు కావడంతో బట్లర్ సేన ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 26 పరుగులకే జాసన్ రాయ్ (0), జోరూట్ (0), బెన్‌స్టోక్స్ (0), బెయిర్‌స్టో (7), లివింగ్‌స్టోన్ (0) వంటి కీలక ఆటగాళ్ల వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌కు జోస్ బట్లర్ కొంత ఆదుకున్నాడు.


భారత బౌలర్లను కాసేపు ఎదురొడ్డిన బట్లర్ అతి కష్టం మీద 30 పరుగులు చేశాడు. దీనికి తోడు చివర్లో డేవిడ్ విల్లీ (21), బైడన్ కర్స్ (15) పరుగులు చేయడంతో అతి కష్టంగా 100 పరుగులు దాటింది. మొయిన్ అలీ 14, క్రెయిగ్ ఒవెర్టన్ 8 పరుగులు చేశారు. ఆతిథ్య జట్టులో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. వారిలో నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 6, షమీ 3 వికెట్లు తీసుకోగా, ప్రసిద్ధ్ కృష్ణకు ఓ వికెట్ లభించింది.

Updated Date - 2022-07-13T01:17:47+05:30 IST